Tuesday 29 November 2016

పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం

కొట్టారక్కర నండి చివరగా మేం తిరువనంతపురం బయలుదేరి కొంత దూరం రాగానే భోజనం ముగించుకొని బస్సు ఎక్కాం. ఎక్కడా సరైన మన భోజనం దొరకదు,  పరోటాలే ఆధారం. చల్లని నీల్ల బాటిల్ అడిగితే వింతగా చూస్తున్నారు, అంతటా ఆయుర్వేద మూలికలతో మరిగిస్తున్న నీటినే తాగుతున్నారు. తిరువనంతపురం చేరి హోటల్ రూం తీసుకునేసరికి రాత్రి 12.00 అయింది. ఉదయాన్నే పద్మనాభస్వామి ఆలయానికి బయలుదేరి పెళ్లాం. కేరళ ఆలయాలలో ప్రధానంగా రెండు గుర్తుపెట్టుకోవాలి.
మగవారు చొక్కా/బనీను/ప్యాంటు ధరించరాదు. పంచెలో
మాత్రమే వెళ్ళాలి. ఆడవారు చీర/పంజాబీ డ్రెస్సులో
వెళ్లవచ్చు. మగవారి నిబంధనలు చిన్న పిల్లలకు కూడా
వర్తిస్తాయి. ముందుగానే తెలుసు కాబట్టి పంచె కట్టుకొని బయలుదేరాము.
లేదంటే ఆలయం ముందు కొనుక్కోవచ్చు. చొక్కాలు, పర్సులు, ఫోన్లు క్లాక్ రూంలో పెట్టి లోపలికి వెళ్లాం. కేరళ లో ఎక్కడా కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం కనిపంచలేదు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం..
అంతులేని సంపదకే కాదు, అనంత మహిమలకూ ప్రతీకనే అంటారు. భారతదేశంలోని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో 11 కేరళలో ఉన్నాయి. అందులో తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం ఒకటి. ఆలయం ఒకప్పుడు
"ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి
నిర్వహణలో వుండేదిట. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్
సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని
తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో
పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించిన నాటినుండి ఇప్పటివరకూ వారి ఆధీనంలోనే ఉంది. ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి
మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల
మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి,
పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి
దర్శించు కోవడమే. ఇటీవల కోర్టు ఆదేశంతో ఆలయ నేల మాళిగలలో గదుల నుంచి వెలికి
తీసిన టన్నుల కొద్దీ బంగారం, బంగారు వజ్రా భరణాలు, వజ్ర-
వైఢూర్యాలు, దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు
పొదిగిన నగలు, పురాతన బంగారు వెండి నాణాలు, కోట్లాది
రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో
చేసిన ఏనుగు బొమ్మ, కేజీల కొద్దీ ఇతర బంగారు
విగ్రహాలు, వేలాది కంఠాభరణాలు, గొలుసులు,  ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంచుల్లో
భద్రపరిచిన 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల
కాలం నాణాలు, ఈస్టిండియా కంపెని, నెపోలియన్ కాలాల నాటి
నాణాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. బంగారు గొలుసులు,
బంగారు టెంకాయలు, స్వర్ణ శంఖాలు, తదితర చిత్ర
విచిత్రమైన పురాతన వస్తువులు అక్కడ లభ్యం కావడం
ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ ఇన్ని
సంవత్సరాలుగా నేలమాళిగలో నిక్షిప్తమై పోయాయి. మానవ
మాత్రులెవ్వరూ, ఇప్పటి వరకు, కనీ వినీ ఎరుగని, కళ్లారా
ఒక్క చోట చూడని "అనంతమైన సంపద", పద్మనాభ స్వామి
ఆలయంలో బయటపడింది.

No comments:

Post a Comment