Monday 25 December 2017

పరభాషా మోజులో స్వంత భాష పరిమళాల్ని కోల్పోరాదు.



  నిన్న ఒక వీడియోలో చూసాను, ఒక వ్యక్తి తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు కెసిఆర్ వెనుకబడిన వర్గాలకు ఇంగ్లిష్ నేర్చుకునే అవకాశంలేకుండా
 చేస్తున్న కుట్ర అని తన అసహనాన్ని వెల్లగక్కుతుంటే అనిపించింది
మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టడం అంటే ఇదేనేమో అని

ఒక భాష అంతరిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో,
 వారసత్వంగా వచ్ఛే ఎంత సాహితీ సంపద కనుమరుగవుతుందో
కుట్ర ముసుగేసుకున్న, మోసాలు నిండిన మనుషులకు ఏమి తెలుస్తుంది, 
 “మాతృబాషలోవిధ్యాబోధన వల్ల విధార్ధులలో
 సృజనాత్మకతపెరుగుతుంది”.
మాతృబాషలో విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం
పెరుగుతుందని శాస్త్రజ్ఞులు కూడా  అంటున్నారు.
 ప్రపంచం లోనే మన తెలుగు లిపి రెండవ ఉత్తమమైనదిగా గుర్తించబడింది
(మొదటిది కొరియా )
ప్రస్తుతం ప్రపంచంలో 10 కోట్ల  మంది మాట్లాడుతున్న భాష తెలుగు
ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 16 వది
ప్రపంచంలో ఉన్న ప్రాచీన భాషలలో తెలుగు కూడా ఒకటి 
ప్రపంచంలోని ఏ భాషకు లేని విధంగా 72వేల నాడులును కదలించే శక్తి
మన తెలుగుకు ఉన్నది. 
కొన్ని వేల సంవత్సరాలుగా వాడుకలో ఉండి శాసన  భాషగా,
సాహిత్య భాషగా నిలదొక్కుకొని ఇంకా సజీవంగా నిలిచి ఉన్న విశిష్ట భాష తెలుగు .
ప్రపంచంలో సాప్రదాయ భాషలుగా గుర్తించినవి 6 భాషలు మాత్రమే
అందులో  తెలుగు కూడా ఒకటి
( మిగిలినవి సంస్కృతం, గ్రీకు, లాటిన్, తమిళం, పర్షియ)
ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ  క్లిక్ చేసి చూడండి.

ఇంత గొప్ప భాషను నేర్చుకోవానికి ఎందుకంత బాధ,
ఇంగ్లీష్ పై ఎందుకంత మోజో అర్థం కాలేదు.
అవసరానికే అన్య భాష అని వీళ్లెప్పుడు తెలుసుకుంటారో!

Tuesday 19 December 2017

సవారి కచ్చరం నుంచి గాలిమోటర్ దాక



మేడారం జాతర అంటే తెలవనోల్లు లేరు ఇప్పుడు దేశంల 
జాతర అంటే మేడారమే గింత పెద్ద జాతర ఇంతవరకు జూడనేలే.
ఔ మరి దేశం మొత్తంల  ఇదే పెద్దది గద.
చిన్నప్పుడు జాతరకు  పోతే ఆ జనంల ఏడ  తప్పిపోతమో  
అని పెద్దోల్ల  చేయి వదిలేటోల్లం  కాదు 
తప్పి పోతావ్ ర పిలగా అటిటు ఉరకకు అనేటోల్లు .
ఎవ్వలన్నతప్పిపోతే గనక గద్దెల ముందట ఉండే మా ఊరివాళ్ళ  మిఠాయి దుకాణం కాడికి రావాలని గుర్తు చెప్పేటోల్లు
జాతర దినాలల్ల అమ్మల గద్దెల సుట్టూ దుకానలు లేస్తయి తాడిఫత్రీలు, తడకలేస్కొని. 
బంగారం (బెల్లం), బట్టలు, కోళ్ళు, బోళ్ళు,బొమ్మలు  మిఠాయిలు  అమ్మేటియి.
ఇంకా సర్కసోల్లు, రికార్డింగ్ డాన్స్, డ్రామా వోళ్ళు నుమాష్(exibitation) గూడా ఉంటై. 
నుమాష్ ల రంగుల రాట్నం గూడ వస్తయి. కానీ బయపడుతమని మా వొళ్ళు రాట్నం ఎక్కనియ్యక పోయేది  యింక ఓ బల్ల మీద సబ్బు పెట్టెలు, సబ్బులు, పవుడర్లు గసోంటి సామన్లు పెట్టి, చారానకొ, ఆటానకొ ఒక రింగు ఇచ్చేటోల్లు. ఆ రింగు దేని మీదనన్న పడితే అది మనదే, కని ఆ రింగు చెంగున ఎగుర్తుండె స్ప్రింగోలిగె దేని మీద పడకుంట. 
జాతరకు నా చిన్నప్పుడు ఇప్పటి లెక్క  ఇంతగనం కోట్లల్ల జనం వచ్చేటోల్లే గాదు. 
ఇప్పుడంటే డబల్ రోడ్లు ఐనై గావట్టి ఎక్కడ ఆగకుంట పోతాన్లు 
ఒక్క రోజుల తిరిగి వత్తాన్లు గని మా చిన్నప్పుడు రొండు మూడు  రోజులు పట్టేటిది. 
ఇప్పుడు  గాలి మోటార్లు కూడా పెడుతాండ్లు . 
గాలి మోటార్ ల పొతే ఒక్క  గంటలనే  పోవచ్చట. 
ఎన్కట జాతరంటే వారం రోజుల ముందుగాల్నే పనులు  షురూ చేసేటోల్లట మా బాపు చెప్పేటిది. వారం ముందుగాల ఓ మంచిరోజు  ఎడ్లను, బండిని (మాకు సవారి కచ్చరం  ఉండేది,ఊళ్లో ఏ పటేల్ కో, పట్వారికో, దొరకో మాత్రమే సవ్వారి కచ్చరం బండి ఉండేది.) రైతులందరికీ ఎడ్ల బండి ఉండేది మంచిగ కడిగి  గీరెలకు సుద్ద పూసి, పసుపు కుంకుమ రాసి, కానికి పసుపు కుంకుమ రాసి పల్లాకి లెక్క తయారు చెసేడ్ది. ఎడ్లకు కూడ బొట్లు పెట్టి, గజ్జెల దుత్తలు,బుడిగలు  గట్టి, కుంకుమ సల్లి ఎనకటి రాజుల గుర్రాల లెక్క తయారు జేసి .బండ్లె కూసునెటానికి మందం వరి గడ్డి ఏసుకుని . పొయిల కట్టెలు, వంట సామాన్, కొబ్బరి కాయలు, మొక్కు బంగారం, ఈత సాపలు, ఙంపఖాన బండ్లె ఏసుకోని, వాడ బండ్లు మొత్తం ఒక్క సారి బయిల్దేరేటియట. వారం మొత్తం బండ్లు నడ్సుడేనట, ఆడ ఆడ ఆక్కుంట....  మా ఊరికాంచి ఓ పది మైళ్ళు పోయినంక జంగల్ మొదలయ్యేటిదట, ఇగ మేడారం దాక ఎనభై మైళ్ళు జంగలే నట ఎక్కడనో ఓ పల్లె ఉండేటిదట . 
ఇదివరకు జాతర ఐపోయినంక మేడారంల మళ్ళా రొండు ఏండ్ల   దాక ఒక్కలు గూడ కనపడక పోయేటిదట  కానీ ఇప్పుడు రోజూ జాతర లెక్కనే ఉంటాన్లు జనం.
1964 దాకా ఎడ్లబండ్లె తప్ప ఇంకోటి తెల్వని జాతరకు 1966 ల 101 బస్సులు మొదలుపెట్టిన్లు 
మెల్లమెల్లగా పెరుగుతా.. పోయిన జాతరకు 3600 బస్సులు నడిపిన్లు.2010 నుంచి హెలికాప్టర్లు గూడ మొదలైనై ఇంకా ప్రైవేటు కార్లు, జీపులు, బస్సులూ,,ఇంకా ఎన్నో, లెక్కనే లేదు. 
1996 జాతరను స్టేట్ ఫెస్టివల్ అని ప్రకటించినంక బాగా జనం పెరిగి 
పోయిన సారి జాతరకు రెండు కోట్ల మంది వచ్చిన్లట ,
అంటే హైదరాబాద్ పట్నంల ఉండే జనం కంటే రెండంతలు.
అడివి మొత్తం జనంతోటి నిండిపోతది. 
ఎన్ని పనులున్నా  కాని జాతర మాత్రం మిస్ అయ్యేటోల్లం కాదు ఈ సారిగూడ ఇంట్ల కెళ్ళి ఒక్కలమైన పోవాలె అమ్మలకు మొక్కులు అప్పజెప్పాలె...


Tuesday 5 December 2017

మళ్ళీ సైకిల్ కాలం


నా చిన్నప్పుడు సైకిల్ ఎవరో ఒక్కరికో గాని ఉండేది కాదు,
కానీ అందరికీ అవసరం ఉండేది.
దాంతో అందరూ సైకిళ్ళు కిరాయికి ఇచ్చే షాపులపై ఆధారపడే వాళ్ళు .
ఎవరో ఒకరు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకెళ్తే సైకిల్ ఇచ్చేవాళ్ళు.
ఒక గంటకు 25 పైసలు కిరాయి ఉండేది, 
క్యారల్ఉండేదైన, చిన్న సైకిల్కైనా 50 పైసలుకిరాయి  ఉండేది. 
దాంతో కొంతమందికి జీవనోపాధి లభించగా సైకిల్ లేనివాళ్ళకు అవసరం, మోజు తీరేది.
మా కుటుంబానికి మాత్రం నాలుగు సైకిళ్ళు ఉండేవి.
దాంతో నాకు కూడా చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. 
సైకిల్ ఎత్తుగా ఉండడం వల్ల సీటు మీద కూర్చుంటే కాళ్లు అందక పోయేవి. 
అందుకని సైకిల్ మధ్యలో కాలు పెట్టి తొక్కేవాళ్లం. 
దాన్ని ‘కాంచీ’ అనేవాళ్లం. 
కాల క్రమంలో బైకులు, స్కూటర్లు, వాటికి ఫైనాన్స్ ఇచ్చే సంస్థలు వెలిశాక
దాదాపు సైకిళ్ళు తొక్కే వాళ్ళు తగ్గి పోయారు.
ఇంకా సైకిల్లకంటే బైకులే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.
కాని  మళ్ళీ ఇప్పుడు అలాగే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలో
సైకిళ్ళు కిరాయికి ఇచ్చే సంస్థలు వెలిశాయి.
ఇప్పుడు మాత్రం కాలుష్యాన్ని తగ్గించడం , ఆరోగ్యాన్ని పెంచుకోవటం
అనే లక్ష్యంగా వెలిశాయి.
కాని వీటిని కిరాయికి తీసుకోవాలంటే అందరికి సాధ్యం కాదు.
వాళ్ళ సంస్థలో సభ్యత్వం ఉండితీరాలి.
గంటకో పది రూపాయల కిరాయి ఉంటుందట.
చోరిలను నివారించటానికి  సైకిల్ GPS తో అనుసంధానించబడి ఉంటుందట.
పైగా వెనుకటిలాగా సైకిల్ తీసుకొని పోయిన చోటనే తిరిగి ఇవ్వాల్సిన అవరసం లేదు
దగ్గరలో ఉండే వారి ఇంకో స్టేషన్లో ఇవ్వొచ్చట.
మొత్తానికి కొన్ని ట్రాఫిక్ కష్టాలు తీరటం తో పాటు కాస్త ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చన్నమాట.

Tuesday 3 October 2017

ఎవరి భాష వారికి గొప్ప

దసరా పండగ ముందు కాస్త  బిజీగా ఉండటంవల్ల
అప్పుడు రాద్దామనుకున్నా పోస్టు కొంచం లేటయ్యింది.
ఒక ఇరవై రోజుల క్రితం శ్రీకాకుళం నుండి
ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడుతూ మధ్యలో 
నా బ్లాగు చూసినట్టు, అందులో
 పోస్టులు  జీలకర్ర బెల్లం లేకుండా పెళ్ళి ,   డబుల్ డెక్కర్ బస్సు చదివి
భలేగా రాసావురా కాలేజి రోజులు గుర్తుకొచ్చాయిరా
నేనుకూడా ఒకట్రెండుసార్లు మీతో కలిసే
డబుల్ డెక్కర్ లో అమీర్పేట్ నుండి
సికింద్రాబాద్ వచ్చినట్టు గుర్తు అన్నాడు.
కొంతసేపు మాట్లాడాక సడెన్ గా
అయినా  మీకు తెలంగాణ వచ్చాక పూర్తిగా
భాష మారిపోయిందా? అల్లాంటి భాష  రాసావు అన్నాడు.
మా భాష అంతేకదా ,
మేము అలాగే  మాట్లాడుతాము కదా
అన్నాను . అవునూ  రెండేళ్ళు కాలేజి చేసినవ్,
ఐనంక  ఓ ఐదేళ్ళు వరంగల్ లో నౌకరి చేసినవ్
మా భాష నేర్సుకోలేదా అనగానే,
ఔరబై మస్తు యాది ఉంది అన్నాడు
అదీ అలాగుండాలి
 ఆదరణ కోల్పోతూ ఒక 
పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న
 ప్రపంచ  భాషలలో కెల్లా గొప్పదైన 
తేనే లాంటి మన తెలుగులో 
ఎన్నో మాండలికాలు  అందులో తెలంగాణా యాస ఒకటి 
నా యాస నాకు గొప్ప మాకాడ గిట్ల మాట్లాడుతేనే అర్ధం ఐతది 


Friday 15 September 2017

స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే


మొన్న ఒక రోజు  సిటీకి వెళ్ళినప్పుడు  
ఆటోలో వెళ్తుంటే పెద్ద ఊరేగింపు
ఎదురుగా రావటంతో ఆటో పక్కకు ఆపాడు డ్రైవర్.
ముందు పెద్ద బ్యాండు మేళం ,ఆ వెనకే చప్పుడ్లు
కొంత మంది డాన్స్ లు చేస్తున్నారు,
ఇంకా ఓ 30,40 కార్ల వరుస
దాదాపు ఓ 50మందితో  పెళ్లి ఊరేగింపు అనుకున్నా,
కాని ఎక్కడో తేడా కొడుతోంది
దగ్గరికొచ్చాక చూద్దునుగదా అది శవయాత్ర.
ఆశ్చర్యం ఇంతపెద్దగానా  అంతిమయాత్ర .
బాగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తట.
దాదాపు ఓ 3  లక్షల పైనే  ఖర్చు ఉండొచ్చు.
ఆ మాత్రం లేకపోతె ఎలా? అన్నారు.
కాకపొతే నాదొక్క డౌటు చనిపోయిన రోజే
ఇంత ఖర్చు చేస్తే మిగతా 11 రోజులు
ఎంత ఖర్చు ఉంటుందో ..
అయినా డబ్బున్నోడి ఇంట
చావుకూడా పెళ్ళిలాంటిదే  

Friday 1 September 2017

అడుగడుగునా గణపతి


ఇప్పుడు మా వూళ్ళో ఏ చౌరాస్తా లో నిలబడి చూసినా
కనీసం ఒక అయిదు, ఆరు గణపతి మండపాలు
కనిపిస్తాయి. లౌడ్ స్పీకర్లలో పాటలు మొగుతూంటాయి.
అందరూ గణపతి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్
ప్రవేశపెట్టాడు అనుకుంటారు,కాని అంతకుముందే ఉన్న
వీటికి స్వాతంత్రోద్యమ కాలంలో బాగా ప్రాచుర్యం కలిపించి
ప్రజలందరినీ సంఘటితం చేయటానికి వేదికగా వాడుకున్నాడు.
అప్పుడు ఊరికో గణపతిని ప్రతిష్టించి అందరూ అక్కడికే వచ్చేవారు.
కాని ఇప్పుడు ఒక్కో పార్టీకి, కమ్యునిటికి,గుడికి, బడికి, వాడకు
వేరు వేరుగా ప్రతిష్టించి ఎవరికివారే పూజలు చేసుకుంటున్నారు.
హిందువులకు భక్తి ఉన్నది.. కానీ శక్తిలేదు అని కొందరు
అంటుంటారు. అవును సంఘటిత శక్తి  లేదు అనిపిస్తుంది
ఇన్ని మండపాలు చూసినపుడు.
ఇందులో ఆర్భాటానికో, చందాలు దండుకోవటానికో కొన్ని
వెలిస్తే కొన్ని మాత్రం దీన్ని వేదికగా చేసుకొని ఎన్నో
హర్షించదగిన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాయి.

ఆర్య వైశ్య యువజన సంఘం వారు మాత్రం
ఎక్కువగా సామాజిక  కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తారు.
మొదటి రోజు మట్టి గణపతి ప్రతిమలు ఉచిత పంపిణీ నుండి మొదలుకొని
విద్యలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, వివిధ అంశాలపై
వ్యాసరచన పోటీలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకను చాటుతారు.
ఇప్పటివరకు మా ఊళ్ళో ఏ ఉత్సవాలకు
పెద్దగ గొడవలు జరిగిన దాఖాలాలు లేవు .
కాని ఈసారి పోలీసులు ఎక్కువగా నిబంధనలు విధించారు.
ఐతే ఇన్ని మండపాలు ఒక్కొక్కటిగా తగ్గి ఒక్కటే ఐతే ఎంతోసంతోషం
మా ఊరు ఊరంతా ఐకమత్యంగా ఉన్నారని , కానీ నెరవేరదు కదా .



Thursday 17 August 2017

కన్నీరే మిగిలిందిక


వృద్ధులను బాగున్నావా? అని పలకరిస్తే ఆనందం కన్నా కన్నీళ్ళే రాలుతున్నాయి .
 తగ్గుతున్న మానవత్వ విలువలకు నిదర్శనం ఇది.
ఈ రోజు కంటి చూపు పరీక్ష చేయించుకుందామని ఆసుపత్రికి  వెళ్ళాను.
నాలాగే చాలా మంది వచ్చారు, అందులో వృద్ధులే ఎక్కువ . 
తెలిసిన వారి హాస్పిటల్ కాబట్టి 
ఎక్కువగా వెయిట్ చేయాల్సిన పని లేదు కాని 
డాక్టర్ లంచ్ చేస్తుండటంతో పావుగంట ఆగాల్సివచ్చింది.
వచ్చిన పేషంట్లలో కొంత మంది తెలిసిన వాళ్ళు
ఉండటంతో మాటలు కలిపాను.
వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటూ వీళ్ళకు కొంత డబ్బు పంపిస్తున్నారట,
పండక్కో పబ్బానికో కానీ రావటంలేదట ,
 కొందరైతే అదీ లేదట ఎన్ని సంవత్సరాలైందో
అని కన్నీటి పర్యంతమయ్యారు.
వాళ్ళను పెంచి పెద్ద చేసేందుకు తెచ్చిన అప్పులే తీరలేదట.

 అమ్మా నాన్నలను మిస్ అవుతున్నట్టు ఫేస్బుక్ వాట్స్ అప్ స్టేటస్ లు పెట్టేకంటే
రోజు ఒక్కసారైనా ఫోన్ లో పలకరిస్తే ఎంత ఆనందిస్తారో.
తల్లి దండ్రులకు శుభాకాంక్షలు చెప్పటమంటే
జీవితాంతం వాళ్లకి సేవ చేయటమే కాని
స్టేటస్ లు పెట్టడం కాదు.
అయినా స్వతంత్ర భావాలకు అలవాటు పడి
ఏదైనా మనకెందుకులే అని బ్రతుకుతున్న వాళ్లకి
ఇదంతా ఎప్పుడు బోధపడుతుంది  అత్యాశ కాకపొతే...



Sunday 6 August 2017

రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు


అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

ప్రపంచంలోని ఏ మతానికీ  లేని  ప్రత్యేకత హిందూ ధర్మానికి  సొంతం .
ఎన్నో మతాలు, ధర్మాలు, వర్గాలు, కులాలూ ఉన్నప్పటికీ
పూల దండలోని దారం ఎలాగైతే వివిధ రకాల, రంగుల, వాసనల
 పూవులను కలిపి ఉంచుతుందో  అదేవిధంగా
భారతీయులందరినీ హిందూ ధర్మం అలాగే కలిపి ఉంచుతుంది.
ఇదే ఇక్కడి గొప్పతనం.
అటువంటి హిందూ ధర్మంలోని సాంప్రదాయాలు,
ఆచారాలు, పండుగలు విభిన్నం,ప్రత్యేకం.
ఇందులో ముఖ్యమైనది రాఖీపౌర్ణమి.
అన్నచెల్లి, అక్కాతమ్ముల్ల అనుబంధానికి ప్రతీక ఈ పండగ .
ప్రపంచంలోని ఏ మతంలోనూ,దేశంలోనూ ఈ పండుగ కనిపించదు.
నిజానికి అన్నాచెల్లెల బంధం ఎంత అపురూపమైనది!
అన్నాచెల్లెల బంధము చిక్కని స్నేహానుబంధ సీమలకన్నన్
మిక్కిలి పైస్థాయినిపెంపెక్కిన చక్కని విశిష్ట ప్రేమామృతమౌ
అంటాడో కవి...
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు…. 
కుటుంబంలో ఆప్యాయతలకు నెలవైన
అనుబంధాలు. 
చెరిగిపోని, కరిగిపోని ప్రేమానుబంధాలు. 
అమ్మ, నాన్న తర్వాత అంతటి
ప్రేమాభిమానాలు ఉండేది సోదరీసోదరుల మధ్యనే.  
అక్కో చెల్లినో రాఖీ కడుతుంటే 
మురిసిపోని సోదరుడు ఉంటాడా చెప్పండి.
కానీ 'ప్రేమా... గీమా'
అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికో..      
 బహుమతులను  ఆశించి  'అన్నా' అంటూ పొడి పొడి అప్యాయతలతోనో 
రాఖీలు కట్టి నవ్వులపాలు కాకండి. 

మరొక్కసారి

అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....

Tuesday 18 July 2017

పిల్లలు జాగ్రత్త

 రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు పిల్లల్నిజాగ్రత్తగా  చూసుకోండి.
ఇద్దరు పిల్లలు ఒకటి రెండు బ్యాగులతో 
వెళ్ళేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు  ఇంకా జాగ్రత్త.
 పిల్లల చేయి వదలకండి, గడుగ్గాయి లాంటి పిల్లలతో 
ఇంకా ఇంకా  జాగ్రత్త. లేదంటే కడుపు కోత మిగులుతుంది.
కింది వీడియో చుడండి చిన్న పిల్లవాడి 
అనాలోచిత చర్య ప్రాణం తీసింది 

వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 
పొంచి వున్న ప్రమాదాలు చాలానే ఉంటాయి.
భారి వర్షాలు వరదలతో రోడ్లు జలమయం అవుతున్నపుడు 
పిల్లల్ని బడికి పంపకపోయినా పెద్ద నష్టం లేదు.
 వారి ప్రాణాలకంటే ఏదీ విలువైనది కాదు.
దీంట్లో  చూడండి అదృష్టం కొద్దీ

ప్రాణాలతో బయటపడ్డ పిల్లవాడిని.


తప్పనిసరై పిల్లల్ని ఒంటరిగా పంపేటప్పుడు
వెనకా ముందూ ఆలోచించి పంపించండి,జాగ్రత్తలు చెప్పి పంపించండి 
లేదంటే తీరని బాధ మిగులుతుంది.

Saturday 8 July 2017

ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా....




ఇక ఏడుకొండలకు ఉన్న మెట్లన్ని
ఎక్కి వెళ్లినా భక్తసులభుని దర్శనం
ఇక నుండి దుర్లభమే....

శ్రీనివాసా!
భక్తులు తిండిలేక గాని,
దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు.

వారి బలగాన్ని వసతులను వదలుకొని
కాలినడకన అలసి సొలసి వచ్చి నీ క్షణకాల దర్శనం కోసం
మళ్లీ పడిగాపులు పడటం ఏమిగతి స్వామి...
నీవు భక్తులను కాపాడే వాడవంటారే,
కాని నీ అక్రమాల కార్యాలయంలో లడ్డూలు,  వడలు వంటి
ప్రసాదాలనేకాక దర్శనానికి టకెట్లు అమ్ముతారా!!

ఏమి దుర్దశ ?
భక్తులకు నీ దర్శనం కూడ
ఉచితంగా అందించలేవా -

ఇక నుండి శుక్ర, శని ఆది వారాల్లో
కాలినడక భక్తులకు దివ్య దర్శనం
నిలిపి వేస్తూ TTD తీసుకున్న నిర్ణయం
శ్రీవారి భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సామాన్య భక్తులకు సేవలందిచాల్సిన TTD
డబ్బు చెల్లించేవారికి, VIP లకు దాసోహమంటోంది.
భగవంతుడి ముందు ఎవరైననూ సమానమేనని
ఎప్పటికి తెలుస్తుందో.
సామాన్యులూ భక్తులేనని ఎప్పటికి గుర్తిస్తుందో.

Tuesday 4 July 2017

వృద్ధాశ్రమాలు అవసరమా


చాల సంవత్సరాల క్రితం ఒకసారి
R P పట్నాయక్ గారిని ఒక వృద్దాశ్రమం ప్రారంభోత్సవానికి పిలిస్తే 
తన ప్రసంగంలో  ఆశ్రమం అట్టర్ ప్లాప్ కావాలని కోరుకున్నాడట. 
దాంతో పిలిచినవాళ్ళు ఖంగు తిన్నారట.
చాలామంది కూడా ఇదే కోరుకుంటారు.

ఎందుకంటే..


ఇవి మన భారతీయ సంస్కృతికి, జీవన  విధానానికి విరుద్ధమైనవి కాబట్టి. 
కాని మారిన పరిస్థితుల్లో ఇవి  అనివార్యం అవుతున్నాయి. 
ఉన్నత చదువులకై , ఉద్యో గాలకు  విదేశాలకు, దూరప్రాంతాలకు
వెళ్లినవారు తప్పనిసరై ఆశ్రమంలో ఉంచితే అర్థం ఉంది.
 వారికి తమ తల్లిదండ్రులపై ప్రేమ లేదనుకుంటే  అది పొరపాటే 
వారి పితృ భక్తిని శంకించాల్సిన అవసరం లేదేమో
కాని తల్లితండ్రులను సరిగ్గా చూసుకొకపొవడం, 
ఒకే ఊరి లొ ఉండి వృద్ధాశ్రమాలలొ పెట్టడం తప్పు. 
ఇటువంటి వారిని నిరుత్సాహపరిచి శిక్షించే  విధంగా
చట్టాలు వస్తే బాగుంటుంది. ఇప్పటికే కొన్ని కోర్టులు 
వేరుకాపురం గురించి తీర్పులివ్వడం మంచి పరిణామం.
కని  పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం 
మంచిది కాదని కోర్టులు మందలించటం మన జీవన విధానంలో
అన్ని  బంధాలను ఏ విధంగా దూరం చేసుకుంటున్నామో 
గుర్తు చేస్తోంది.
మాతృ దేవో భవ పితృ దేవో భవ అన్న వేధ మంత్రాన్ని 
వల్లే వేసిన నోటితోనే బయటికెల్లిపోమ్మని ఎలా అనగలుగుతున్నారు.
కడుపు కట్టుకొని వారు సంపాదించిన ఆస్తులను మాత్రం అక్కున చేర్చుకొని 
అనాథలుగా వారిని వ్రుద్దశ్రమాల్లో చేర్చేముందు 
మీకూ అదే గతి అత్యంత వేగంగా వచ్చేస్తుందని గమనించండి 
మీక్కూడా చావుకు ముందు వచ్చే చివరి మజిలీఅదే కాగలదు.

Tuesday 13 June 2017

ఆత్మహత్య


అవును నిజమే !
మనం అందరం ఆత్మహత్య చేసుకుంటున్నాం.
కాకుంటే నెమ్మదిగా...!
విష రసాయనాలు, కృత్రిమ ఎరువులు
వాడుతున్న ఆహారాన్ని తింటూ
వద్దన్నా ప్లాస్టిక్ కవర్లు వాడుతూ,
అన్నింట్లోనూ ప్లాస్టిక్ కె ప్రాధాన్యం ఇస్తూ
చెట్లను నరుకుతూ
విష వాయువులు నిండిన గాలిని పీలుస్తూ,
మంచిని మరుస్తూ చెడును ఆస్వాదిస్తూ,
అన్నింటా యంత్రాలనే వాడుతూ,
అసలు వ్యాయామాలనే మరుస్తూ,
ఒత్తిడిని పెంచుకుంటూ
సంతోషాన్ని మరిచి పోతూ
అన్ని రోగాలకూ మనమే మూలం అవుతూ
మన ప్రాణాలు మనమే తీసుకుంటూ
ఆత్మహత్య చేసుకుంటున్నాం.
ఇకనైనా మారుదామా,
మన అలవాట్లను మార్చుకుందామా???


Wednesday 7 June 2017

టన్నుల కొద్దీ ఆహారం వృధా


అన్నం పరబ్రహ్మస్వరూపం 
ఇది మన పెద్దలు చెప్పే మాట,
అన్నమే కాదు తినే ఏ పదార్థమైనా పరబ్రహ్మ స్వరూపమే.
ఒకప్పుడు ఆహార పదార్థాలను పెద్దగ వృధా చేసేవారు కాదు.
రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా ఎవరికైనా ఇవ్వడమో లేదా
తెల్లవారి తినడమో చేసేవారు. కాని ఇప్పుడు అలా లేదు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
నిన్న ఒక ఫంక్షన్లో వృధా ఐన ఆహారాన్ని చూసిన
తర్వాత రాయాలనిపించింది.
తిన్న దానికంటే వృధా చేసిందే ఎక్కువ అనిపించింది.
అందరూ ఆకలి కంటే రుచికే ప్రాధాన్యతనిస్తూ ఎక్కువగా పారవేసారు.
ఇది ఫంక్షన్ జరిగినప్పుడు లోపల సీన్ ,
బయట ఈ వృధా కోసం కొంతమంది కొట్టుకుంటున్నారు, తినడానికి.
రెండింటికి మధ్య కేవలం ఒక్క గోడ మాత్రమే అడ్డు.....

ప్రపంచంలోని ఆహారం మొత్తంలో దాదాపు 35శాతం
పండించిన చోటు నుండి ఇంటికి చేరకముందే
వృధా అవుతోందని లెక్కలు చెప్తున్నాయి,
 ఇక మన దేశంలో మాత్రం మన అవసరానికి మించి
రెండితల ధాన్యాలు ఉన్నాయని అంచనా.
కాని ప్రతి రోజు ఖాళీ కడుపుతో నిద్రపోతున్న వాళ్ళు కోట్లల్లో ఉంటున్నారు .
వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి అవసరం ఉన్న వారికి అందిస్తున్న
తమిళనాడులోని "నో ఫుడ్ నో వేస్ట్" లాంటి  సంస్థలు ఉన్నప్పటికీ ,
వృధా అవుతున్న దానిలో కేవలం ఒక్క శాతాని మాత్రమే వినియోగించగలుగుతున్నాయి.

రోజు ఒక పిడికెడు అన్నాన్ని వృధా చేస్తే
అది ఒక సంవత్సరంలో ఒక బస్తా బియ్యానికి సమానం.
వృధాని అరికట్టండి. అవసరం ఉన్నంతే వండుకోండి, కొనుక్కోండి.

Friday 2 June 2017

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణా ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ  దినోత్సవ శుభాకాంక్షలు 

Saturday 27 May 2017

జీలకర్ర బెల్లం లేకుండా పెళ్ళి


తెలంగాణల పెండ్లి చేసుకునే పోరగాల్లకు 
పెద్ద కష్టం వచ్చి పడ్డది. 
ఎక్కడా బెల్లం దొరుకుతలేదు,
 జీలకర్ర బెల్లం లేకుండా పెండ్లి చేసుడే లేదని 
అయ్యగార్లు అనబట్టిరి. ఇగ కష్టం కాక ఏంది? 
అసలు ఈ కష్టం ఎందుకచ్చిందో  తెలుసా. 
వచ్చే జూన్ ల బ్రాందీ షాపులకు  టెండర్లు ఉన్నయట, 
మరి ధర బాగ పలకాలంటే గుడంబా బంద్ గావాలె,
అంటే బెల్లం దొరుకద్దు..... 
ఉపాయం మంచిగానే ఉన్నది గని 
పెండ్లి చేసుకునే పోరగాండ్ల సంగతి ఎట్లా ??  
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే గిదే. 
అయినా బాపనోళ్ళు జిలకర బెల్లం లేకుండా 
పెళ్లి చేసుడు నేర్సుకోవాలె.
గప్పుడే g కష్టాలు తీరుతై...

(బెల్లం కష్టాలు ఇవ్వాలే కాదు, దాదాపు తెలంగాణా రాష్ట్రం వచ్చిననాటినుండి ఉన్నాయి.)

ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే గత 
మేడారం జాతరకు కూడా బెల్లం కోసం  
చాలా ఇబ్బంది ఏర్పడింది,
బెల్లం లేకుండా మేడారం జాతరను
 ఊహించనుకూడాలేము.
అలాగే గత ఉగాది కి కూడా. 
బెల్లం హిందూ సాంప్రదాయంలో ప్రతి కార్యక్రమం లో
 విడదీయరాని సంబధం కలిగి ఉంటుంది. 
మరి మన దగ్గరే నిషేదిస్తే ఎలా? 
బెల్లం పై ప్రభుత్వ పెద్దలకింత కక్ష ఎందుకో??

Tuesday 23 May 2017

సంస్కారం లేని జీవితాలు


ఎవరైనా పెళ్లి, పుట్టిన రోజు పార్టీ లకు పిలిస్తే 
మనం కేవలం వాళ్ళ తిండి కోసమే వెళ్తున్నామని అనిపించింది.
ఈ మధ్యే ఒక ఫంక్షన్ కి వెళ్తే అలాగే అనిపించింది.
మేము వెళ్లేకంటే చాలా ముందే కార్యక్రమం మొదలైంది. 
భోజనాలు కూడా ... 
    పిలిచిన వాళ్ళని పలకరిద్దామని కుర్చీలోంచి లేచా, 
ముందు భోజనాలు కానిద్దాం...
స్టేజి పైన చాలామంది ఉన్నారు.
మనం వచ్చే సరికి వాళ్ళంతా వెళ్ళిపోతారు అన్నాడు
 పక్కనే కూర్చున్నమిత్రుడు.  
భోజనం ముగించిన తర్వాత మల్లి వచ్చి కూర్చున్నాం.
ఇంకా స్టేజి పై చాల మందేఉన్నారు.
ఇక వ్యాపార విషయాలు, ఊళ్ళో విషయాలు మాట్లాడుతున్నాం. 
కాసేపటికి విష్ చేద్దామని లేచాం.
ఇంతలో ఒకతను వచ్చి ఏమండీఫలానా కూరలో
ఉప్పు సరిగాలేదు ఇంకేదో దాంట్లో నెయ్యి ఎక్కువైందని , 
ఫలానా టిఫిన్ పెట్టారు,
కాని ఎండాకాలం కదా ఇంకేదో ఐటెం 
పెడితే బాగుండేది అని మొదలు పెట్టాడు.
విష్ చేద్దామంటే అదేదో ఫొటోలకి 
సంబందించిన వ్యవహారం లాగ క్లాసు పీకి, ఇక వెల్లిపోదాం పద అన్నాడు.
అసలు ఎందుకొచ్చాం, ఏంచేస్తున్నాం అనిపించింది.
ఎంతో ప్రేమగా వాళ్ళు పిలిస్తే వెళ్ళేది కేవలం తిండి కోసమేనా?
కనీసం దీవించడమో, అభినందించటమో చేయకుండా తిరిగి వెళ్ళడమా..
ఆప్యాయతను, అభిమానాన్ని కలబోసుకొని ప్రేమ పూర్వకంగా
పిలిచినప్పుడు కనీసం 
అభినందించకుండా వెనుదిరగవద్దు ఎంత లేటైనా 
 అని మనసులో అనుకుంటూనే బయటికి అనేశా. 
పాపం తల దించుకుని మాతో వచ్చి ఆశీర్వదించివెళ్ళాడు.
నా మాటలతో ఒక్కరైనా మారినందుకు సంతోషం.


    

Wednesday 17 May 2017

Wanna cry కి విరుగుడు వచ్చింది

మీ సిస్టం ను బట్టి కావలసిన లింక్ పై క్లిక్ చేసి update చేసుకోండి

Wannacry Ransomware fixes from Microsoft. Do update ASAP and share with others.

Windows XP SP3 
http://download.windowsupdate.com/d/csa/csa/secu/2017/02/windowsxp-kb4012598-x86-custom-enu_eceb7d5023bbb23c0dc633e46b9c2f14fa6ee9dd.exe 
Windows Vista x86
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/02/windows6.0-kb4012598-x86_13e9b3d77ba5599764c296075a796c16a85c745c.msu 
Windows Vista x64
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/02/windows6.0-kb4012598-x64_6a186ba2b2b98b2144b50f88baf33a5fa53b5d76.msu 
Windows 7 x64
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/02/windows6.1-kb4012212-x64_2decefaa02e2058dcd965702509a992d8c4e92b3.msu 
Windows 7 x86
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/02/windows6.1-kb4012212-x86_6bb04d3971bb58ae4bac44219e7169812914df3f.msu 
Windows 8
http://download.windowsupdate.com/c/msdownload/update/software/secu/2017/05/windows8-rt-kb4012598-x64_f05841d2e94197c2dca4457f1b895e8f632b7f8e.msu 
Windows 8.1
http://download.windowsupdate.com/c/msdownload/update/software/secu/2017/02/windows8.1-kb4012213-x64_5b24b9ca5a123a844ed793e0f2be974148520349.msu 
Windows 10
http://download.windowsupdate.com/c/msdownload/update/software/secu/2017/03/windows10.0-kb4012606-x64_e805b81ee08c3bb0a8ab2c5ce6be5b35127f8773.msu 
Windows 2003 x86
http://download.windowsupdate.com/c/csa/csa/secu/2017/02/windowsserver2003-kb4012598-x86-custom-enu_f617caf6e7ee6f43abe4b386cb1d26b3318693cf.exe 
Windows 2003 x64
http://download.windowsupdate.com/d/csa/csa/secu/2017/02/windowsserver2003-kb4012598-x64-custom-enu_f24d8723f246145524b9030e4752c96430981211.exe 
Windows 2008
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/02/windows6.0-kb4012598-x64_6a186ba2b2b98b2144b50f88baf33a5fa53b5d76.msu 
Windows 2008R2
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/02/windows6.1-kb4012212-x64_2decefaa02e2058dcd965702509a992d8c4e92b3.msu 
Windows 2012
http://download.windowsupdate.com/c/msdownload/update/software/secu/2017/02/windows8-rt-kb4012214-x64_b14951d29cb4fd880948f5204d54721e64c9942b.msu 
Windows 2012R2
http://download.windowsupdate.com/c/msdownload/update/software/secu/2017/02/windows8.1-kb4012213-x64_5b24b9ca5a123a844ed793e0f2be974148520349.msu 
Windows 2016
http://download.windowsupdate.com/d/msdownload/update/software/secu/2017/03/windows10.0-kb4013429-x64_ddc8596f88577ab739cade1d365956a74598e710.msu

బుద్ధిలేని బ్యాంకులు


Wanna cry

నిజంగా నే ఏడిపిస్తోంది.

RBI అదేశంతో దేశవ్యాప్తంగా దాదాపు
 70 శాతం ATM ల మూసివేత.
సరే ఎప్పుడు తెరుస్తారో చెప్పనేలేదు.
 Software update అయ్యేవరకు
 తెరవరంటున్నారు కూడా.
నిజంగా నే ఏడిపిస్తోంది వన్నా క్రై .
నోట్ల రద్దుతో పడ్డ  ఇబ్బందులు
 మరచిపోకముందే  మళ్లీ నగదు కు 
కష్టాలు రానున్నాయా? 
ఎప్పుడో పాతబడిపోయిన softwareతో
 ఇంకా ATM లు నడపటమెందుకు?
బ్యాంకు వర్గాలకు ఇంత నిర్లక్ష్యమెందుకు? 
వాస్తవానికి ATMలను hakeచేయటం అంతసులభమేమీ కాదు .
చాల securit yఉంటుంది.కాని కొన్ని file sమాత్రం
 encrypt అవుతున్నాయని. .  అది కూడా పాత windows 
సిస్టం వాడుతున్న కొన్ని ATMలలో మాత్రమే. 
అటువంటప్పుడు అవేంటో గుర్తించి 
వాటిని మాత్రమే మూసేస్తే బాగుండేది. 
ప్రతీ చిన్న తప్పుకు కస్టమర్లకు ఫెనాల్టీ వేసే బ్యాంకులు 
ఇప్పుడు సమాధానం యేం చెపుతాయి.
 బ్యాంకులఫై  గతంలో రాసిన ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి  చదవండి 
పరిస్థితులిలాగే ఉంటే cash less విధానం సంగతేంటి, 
అటకెక్కించాల్సిందేనా?

Tuesday 16 May 2017

చట్టం దృష్టిలో ఎవరెవరు సమానం

                                         
                 
చట్టం దృష్టిలో అందరూ సమానం

ఇది తరచుగా వినబడే మాట.
కాని మీ దృష్టిలో ఇది నిజమేనా?
కాదంటే మీరు అనుకుంటున్నదేమిటి?
మీకెప్పుడైన ఈ వ్యత్యాసం అనుభవమైందా?
ఐతే ఏ రూపంలో ?
ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో కానీ , 
ప్రయాణంలో కాని, విద్యా, వైద్య విషయాలలోకాని ,
న్యాయ వ్యవస్థలో కాని,
అందరూ సమానంగా చూడబడాలంటే ఏమి చేయాలి? 
మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.
కింద ఉన్న బాక్స్ లో కామెంట్ చేయండి.
మీ అందరి అభిప్రాయాలు ప్రచురింపబడతాయి.

Tuesday 9 May 2017

జై హనుమాన్



నేటితో హనుమద్దీక్షలకు చివరి రోజు కావటంతో
ఆలయాలన్నీ కిటకిటలాడాయి.

దీక్షావస్త్రాల దుకాణాలు ఒక్కసారిగా జనంతో నిండిపోయాయి.
ఇక పూజాసామాగ్రి, మాలలు అమ్మే దుకాణాలు సరేసరి.

పరిస్టితులు అనుకూలించపునపుడు,
సహకరించనపుడు మాత్రమే 11రోజుల దీక్షకు ఉపక్రమించాలి.
లేదంటే 41లేదా 21రోజులకే తీసుకోవటం మంచిది.

దీక్షాకాలంలో
 కాషాయ  రంగు వస్త్రా లనే ధరించాలి.
దీక్షను చేపట్టేముందు కనీసం మూడు రోజుల ముందు సాత్వికాహారం తీసుకోవాలి.
దీక్షా కాలంలో తల, గడ్డం, వెంట్రుకలు, గోళ్లను కత్తిరించకూడదు. పాదరక్షలు ధరించరాదు.
దీక్షా సమయంలో ఒకసారి కనీసం తమ శక్తికొద్దీ ఐదుగురు స్వాములకు
 భిక్ష ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం ఒకపూట భిక్ష (భోజనం)చేయాలి.
 రాత్రి అల్పాహారం తీసుకోవాలి . మితంగా భుజించటం అలవర్చుకోవాలి
అహింస, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహం,
బ్రహ్మచర్యం పాటించాలి. సత్కర్మలతో పాటు వాక్కు శుద్ధిగా ఉండాలి.
మత్తు పానీయాలు తీసుకోకూడదు. ధూమపానం చేయవద్దు .
(మద్యం, మాంసం  వ్యాపారులు ఆలోచించి,గురుస్వాముల లేదా
 అర్చకుల సలహా తీసుకొని  దీక్ష తీసుకోవటం మంచిది.)
దీక్షా సమయంలో కటిక నేలపై నిద్రించాలి.

గుండెనిండా చీకట్లు మాత్రమే పొంగిపోర్లుతున్నపుడు
భగవంతున్నిమనస్పూర్తిగా  వేడుకో
 కమ్ముకున్న ఉదాసీనతలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి.

నాస్తికత,హేతువాదం ప్రబలినప్పటికి,
పరమత ప్రభావం వల్లనూ సనాతన ధర్మం
ఇక కనుమరుగుకాదు అని ఇవ్వాల బలంగా అనిపించింది
ఈమధ్య హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన
మతాల మధ్య చిచ్చుపెట్టి హిందూ ఐక్యతను
దెబ్బ తీయాలనిచూస్తున్న విదేశీ శక్తులనుండి
తర్వాతి తరాలకు హైందవ ధర్మాన్ని  అందించాలి 

Saturday 22 April 2017

మద్యం సేవించి .....




మద్యం సేవించి వాహనం నడుపరాదు ఇది పోలీసు, RTA వారి నినాదం 
మద్యం అమ్మి ప్రభుత్వం నడుపరాదు

ఇది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న నినాదం


ఆదాయం కోసం మద్యపానానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని,
 దానికోసం ఇతర మార్గాలను అన్వేషించాలనేది చాలామంది మాట. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం
 గత ఐదు సంవత్సరాలలో మన దేశంలో
 తలసరి మద్య వినియోగం 38 శాతం
 గత 20 యేల్లతో పోల్చిచూస్తే 65 శాతం పెరిగిందట.

 
బీద కుటుంబాలలోని మరణాలలో 45శాతం
 మద్యం వల్లనేనన్నది నమ్మలేని నిజం.
 దీనితో 75 శాతం కుటుంబాలను స్త్రీలే  పోషించాల్సిన
 పరిస్థితి ఏర్పడుతోంది . మద్యంవలన
 18 నుండి 25 యేల్ల మధ్య వైధవ్యాన్ని పొందుతున్న వారెందరో...
ముఖ్యంగా యువత మద్యానికి తొందరగా ఆకర్షితులౌతున్నారు.
 దీంతో వారి ఆరోగ్యాలని చెడగొట్టుకోవడమే కాకుండా 
 రోడ్డు ప్రమాదాల రూపంలోఎదుటివాళ్ళ ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.


ప్రభుత్వం మద్యనిషేధం విధించాలని కొన్ని చోట్ల  
డిమాండ్ ఉన్నప్పటికీ కొంత అసాధ్యం అనే చెప్పవచ్చు. 
మద్య నిషేధంతో మాఫియాలు, పోలీసులు మాత్రమే
 లబ్ధి పొందుతున్నారని గతంలోనే రుజువైంది.
మద్య నిషేధం వల్ల రాష్ట్రంలో మాదక ద్రవ్యాల 
వినియోగం భారీగా పెరిగిపోయిందని 
కేరళ ఎక్సైజ్‌ మంత్రి కూడా వాదిస్తున్నారు.
కాబట్టి  అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం
 చేస్తున్న తాగుడు దురలవాటు నిర్మూలనకు 
 ప్రభుత్వం సామాజిక జాగృతి ఉద్యమాన్ని నిర్వహించాలి. 
 ఎయిడ్స్‌, గర్భస్థ ఆడ శిశువుల హత్యల వంటి దురాచారాలను
 అరికట్టడంలో సామాజిక జాగృతి కార్యక్రమాలు
 సాధించిన సత్ఫలితాలు మద్యపానం సమస్య విషయంలో
 కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తాయి.

Saturday 15 April 2017

చల్లని చల్లని వేసవి కోసం

వేసవి ఎంత వేడిగా ఉంటుందో... ఆ వేడిలో చల్లదనం తగిలితే అంత హాయిగా ఉంటుంది.
 అందుకే, ఎండాకాలంలో చల్లగా  ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి,
ఈ సీజన్ లో లభించే ఏ పళ్ళను వదలకండి .అన్నిటిని తినండి.
పుచ్చకాయ, ఖర్బుజ, దోస, తాటి ముంజలు వంటివి ఒంట్లో చలువను కలిగిస్తే ,
 ఫలరాజం మామిడి ఎన్నో పోషకాలనిస్తుంది

పుచ్చకాయ లో  బీటా కెరోటి, విటమిన్ ఎ, బి1, బి6 మరియు విటమిన్ సి, పొటాషియం,
 మెగ్నీషియం, మ్యాంగనీస్, బయోటిన్, కాపర్లులు అధికగా ఉన్నాయి .
 ముఖ్యంగా వాటర్ దీని  లో వాటర్ కంటెంట్ 92శాతం ఉంటుంది.
 సమ్మర్ సీజన్లో వాటర్ మెలోన్ తినడం వల్ల రిఫ్రెష్ అవుతారు.


మామిడి పళ్ళు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ఒకచిన్న  మామిడి పండులో 107 కేలరీల శక్తి
ఒక గ్రామ్ ప్రోటీన్,28 గ్రాముల కార్బోహైడ్రేట్లు,2.6 గ్రాముల పీచు పదార్ధం
3 మిల్లీగ్రాముల సోడియం,ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి లో 65 శాతం
విటమిన్ ఇ , విటమిన్  బి 6,శరీరానికి అవసరం అయ్యే ఫోలేట్ ఉంటాయి.



ఇక కర్బూజా  వేడి గాలులనుండి రక్షణనిస్తుంది , ఇందులోని  పొటాషియం
 రక్తపోటును అదుపులో ఉంచటం, మూత్రపిండాల్లో
 రాళ్లు తయారు కాకుండా ఆపటం లాంటివి చేస్తుంది.
 మలబద్ధకం సమస్యను తగ్గించటంలో ఖర్బూజా  బెస్ట్ .

ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా డీహైడ్రేషన్ అయిపోవడం సర్వసాధారణం.
ముంజలతోఈ సమస్య అధికమించవచ్చు
 ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్,
 పొటాషియం.. వంటివి పుష్కలం.

ఇక చల్లని వేసవి మీ సొంతం 

Saturday 8 April 2017

నా నెట్ గోల




ఒక నాలుగు రోజులు నెట్ ఆన్ చేయక పోవడంతో మనసు కాస్త ప్రశాంతంగా ఉంది.
ఐతే జియో ఆఫర్ అయిపోవటం , నేను ఆన్లైన్ లో లేకపోవటం తో అందరూ ఒకటే ప్రశ్నలు.
అంటే అందరూ జియోకు అంతగా అలవాటయ్యారన్నమాట. కాని నేను జియో వాడటంలేదు.
నాలుగు రోజుల క్రితం డేటాఐపోవటంతో మల్లి రీచార్జ్ చేయలేదంతే. నెట్ లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇవ్వాల SBI aadhar based payment ప్రమోషన్లో భాగంగా  బ్యాంకు నుండి ఒకతను రావటంతో మళ్లి recharge చేయవలసి వచ్చింది .
నా ప్రశాంతతకు ఇక మల్లి గండి పడినట్టే!
ఆన్ చేసిన వెంటనే ఒక్కటే whatsapp మెసేజ్ లు .
అవసరం ఉన్న లేకున్నా వివిధ గ్రూపుల్లో ఇరికించేసారు.
 ఓ 30సమూహాలు , దాదాపు రోజు 1000 మెసేజ్ లు , ఫోన్ ఫోటోలతో  నిండిపోతోంది.   డిలిట్ చేయటం కష్టం అవుతోంది. ఒక్కరోజు మరచిపోతే వేలకువేలు gallaryలో అలాగే ఉంటున్నాయి. పోనీ గ్రూప్ ల నుండి exit అవుదామంటే ఏదైనా update మిస్ అవుతామేమో అని భయం, గ్రూప్లో మనల్ని కలిపినవాలు ఫీల్ అవుతారేమో అని బాధ. కాని నెట్ లేని రోజులే బాగున్నాయిఅని మాత్రం అర్థం అయ్యింది. కానీ నెట్ ను మాత్రం వదలలేకపోతున్నా.
ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో online payment ల కోసమైనా ఇంటర్ నెట్ అవసరమే.
 కాబట్టి ఇక ప్రశాంతత అనేది కనుమరుగైనట్టే.

Tuesday 4 April 2017

రోడ్డు ప్రమాదాలు ఆగేనా???

రోడ్డు ప్రమాదాల చట్టం సవరణతో ప్రమాదాలు ఆగుతాయా?


మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవర ణలకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. 
 అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి నుంచి 4 వేల దాకా, కారులో సీటు బెల్టు పెట్టుకోకపోతే, టూవీలర్ పై వెళ్ళే వాళ్లకి హెల్మెట్ లేకుంటే  వెయ్యి, ఇన్సూరెన్స్ లేకుంటే 2 వేలు జరిమానా, లేదా మూడు నెలల జైలు శిక్ష,..ఇలా సరికొత్త నిబంధనలు నిర్దేశించారు. అంతేగాక.మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలవరకూ జరిమానా వసూలు చేస్తారు.

ఇక మైనర్లు ప్రమాదాలు చేస్తే వారి తలిదండ్రులపైనా, సదరు వాహన యజమానులపైనా కేసులు పెడతారు. రూ. 25 వేల ఫైన్, మూడేళ్ళ జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. హిట్ అండ్ రన్ బాధితులకు రూ. 2 లక్షలు, ప్రమాద మృతులకు రూ. 10 లక్షల సాయం అందించాలని  బిల్లు పేర్కొంటోంది. చట్టం అమల్లోకి వస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు 
తగ్గుతాయని భావిస్తున్నారు.

ఐతే చాలా సార్లు  అధికారులకు కూడా కొన్ని నిబంధనలపై, వాస్తవ పరిస్థితులపై అవగాహన లేదనిపిస్తుంది.
రా త్రిపూట జరిగే ప్రమాదాల్లో lowbeem లైట్లు వేయకపోవటం వల్లే ఎక్కువగా జరుగుతుంటాయి 
అటువంటి వాహనాలను గుర్తించడానికి ఏ అధికారి డ్యూటీ లో ఉండరు.
 ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా వాహనాన్ని స్టాప్ లైన్ దాటించకూడదు, జీబ్రా లైన్స్ వరకు తేకూడదు. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్న పట్టించుకోరు. 
 మూల మలుపులో, వీధి కూడళ్ళలో  వాహన వేగాన్ని తగ్గించి హార్న్ కొట్టి వెళ్లాలి. 
 ఏ వాహనానికైన కంపినివారి హారన్ ను మాత్రమేవాడాలి .
 మ్యూజిక్ బయటికి వినపడకూడదు .
 స్కూళ్ళు హాస్పిటళ్ళు ఉన్న చోట హార్న్ వాడకూడదు. 
 వైపర్ (వర్షం పడినప్పుడు నీటిని పక్కకు తొలగించేది) తప్పనిసరిగా ఉండాలి
ఇలా చాల ఉన్నాయి.

 ఎక్కువ ప్రమాదాలు అతి వేగం వల్ల జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏ వాహనమైనా 85 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు కాని ఒక సర్వేప్రకారం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ పై వాహనాలు సరాసరి 120 కిలోమీటర్ల వేగం దాటి  వెళ్తున్నాయట . 
ఇక ఒక్కోసారి సైన్ బోర్డ్ లు చెట్ల చాటున అమర్చడం కూడా ప్రమాదాలకు కారణం అవుతోంది. 

పోలీసులు కేవలం ఫైన్ వేసి డబ్బులు వసూలు చేయటమే కాకుండా  వాహనదారులకు అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

Friday 31 March 2017

ఫూల్ ఎవడు???




ఏప్రిల్ ఒకటి నాడు కొంతమంది  ఫూల్స్ డే జరుపుకోవడం
ప్రతిఒక్కరు  దానికి తమవంతు కృషిగా 
మెసేజ్ తయారుచేసి పంపటం.. 
ఖర్మరా బాబు .....

ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం 
వసంత బుుతువులోనే (ఉగాదినాడు)
ప్రారంభమయ్యేది మనకు లాగే.
 (అంతెందుకు బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం
 సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో
ప్రారంభమౌతుందని తెలుపుతోంది)

            క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో
ఫ్రాన్స్ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ
 11 వ నెలగా ఉన్నజనవరి ని ఒకటవ నెలగా
 నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.ఈ
విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు.
 అసలు ఎందుకు మార్చాడో తెలియదు. కానీ సంవత్సరం
ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని 
ఆలోచించిన కొంత మంది రాజు దృష్టి కి తేవడంతో మార్చాడంటారు.
రాజాగ్నతో చాలామంది జనవరి కి మారినప్పటికీ కొందరు ఏప్రిల్లోనే
 నూతన సంవత్సరం జరపుకుంటూ ఉండడంతో వాల్లను
 ఫూల్స్ గా అవహేళన చేయడంతో ప్రారంభ మైంది ఫూల్స్ డే. 
15 వ శతాబ్దంలోనే యూరప్ మొత్తం ఈ విధానం లోకి మారినా
 ఆసియా లోమాత్రం 20వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన వల్ల మార్చబడింది.
కానీ ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి
"ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. 
అట్టి కాలమానంలోని
అంశాలన్నింటిని పూర్తిగా ఖగోళ శాస్త్ర  రీత్యా ఏర్పాటు
చేసుకున్న ఏకైక జాతి హిందూ జాతి. కాలమాన అంశాలైన రోజు, వారం,
పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం మొదలైన అన్నింటినీ
 ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ
శాస్త్ర  ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.
దాని ప్రకారమే హిందువులు నూతన సంవత్సరం జరుపుకుంటారు. 
(ప్రపంచమంతా కూడా  జరుపుకోవాలి )
మొన్ననే ఉగాది జరుపున్న నేను మాత్రం ఫూల్ ను  కాదు 
ఇక ఇప్పుడు  చెప్పండి ఎవరు ఫూల్స్....

షోరూమ్స్ కి పరుగో పరుగు



BS3 వాహనాలపై మొన్నటి సుప్రీం తీర్పుతో
ఉక్కిరిబిక్కిరయిన ఆటోమొబైల్ కంపెనీలన్నీ
ఏమి పాలుపోక ఒక్కసారిగా ఆఫర్లతో ఊదర గొట్టాయి.
దీంతో టు వీలర్ కొనాలకున్న, మార్చాలనుకున్న
 నాలాంటి  చాలామందిమధ్యతరగతి ప్రజలు
 ఒక్కసారిగా షోరూమ్స్ కు పరుగందుకున్నారు
పాపం అందరికి వాహనాలు దొరకక నిరాశతో
చాలామంది వెనుదిరగవలసివచ్చింది .
వాస్తవానికి నిన్ననే నా మొబైల్ కి మెస్సేజ్ వచ్చింది.
కాని ఎప్పుడు స్పీడ్ గా ఉండే నేను కాస్త అలక్ష్యం చేయటంతో
నన్ను కూడా షోరూమ్స్ ముందు నో స్టాక్ బోర్డ్ వెక్కిరించింది .
ఏం చేస్తాం ఇప్పుడున్న బండి తోనే
ఇంకా కొన్ని సంవత్సరాలు నేట్టుకురావాలి.

Tuesday 28 March 2017

ఉగాది శుభాకాంక్షలు

మావిచిగురు, వేపపవ్వు,
మల్లెల గుబాళింపులు,
కోయిల కుహూరావాలు....
ఉగాది రాకకు సంకేతాలు.
ప్రకృతితో ముడిపడి ప్రతి జీవికి చైతన్యంతో కూడిన ఆనందాన్ని,
ఉల్లాసాన్ని
కల్గించే పండగ ఉగాది.
అచ్చంగా జీవితం
మనకి చూపించే రకరకాల
రుచులకు మల్లే 
తీపి, కారం, చేదు, ఉప్పు,
పులుపు, వగరు ఇత్యాది రుచుల సమ్మేళనమైన
ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ పలుకుదాం కొత్త సంవత్సరానికి ఆహ్వానం ......
అందరికీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Monday 20 March 2017

కులం గోడలు కూల్చాలంటే !

ఇపుడే whatsappలో ఒక మెసేజ్ వచ్చింది
చూస్తేఒక video.
 చాలారోజుల క్రితంది లాగుంది ఫార్వర్డ్ అవుతూ అవుతూ 
ఇవ్వాల  నాకు చేరింది.
దాని సారాంశం వయసోచ్చినవాల్లంతా ఇతర 
కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకొని ఇంటికి 
తీసుకురండి కుల సమస్య తీరిపోతుంది అని ...
   ఎలాసాధ్యం?    నాకర్థం కాలేదు.
ఏ రెండు కులాల ఆచార వ్యవాహారాలు కాని 
ఆహార విహారాలు కాని ఒకేలా ఉండవు
 సమస్య తీరిపోవటం కాదుకదా
 ఎన్నో కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి .
ఆర్ధిక అసమానతలు రూపుమాపబడినప్పుడే 
కుల వివక్ష పోతుంది అని నా ఉద్దేశం.
కులం గురించి అడగడం, చెప్పటం కూడా
రాజ్యాంగ సమ్మతమే కదా 
కుల ప్రాతిపదికనే ఎలక్షన్లో సీటును కేటాయిస్తారుకదా.
విద్యా, ఉద్యోగాలలోనూ కులమే కదా ప్రాతిపదిక.
మన ప్రభుత్వాలే కుల పునాదుల మీద నిలబడి ఉంటున్నాయి 
మా కులం వాడు బాగు పడాలి అనుకోడంలో తప్పేముంటుంది , 
వేరే కులంవాడు నాశనం కావాలనుకుంటే తప్పుకాని. 
యువతను కులాంతర వివాహాల దిశగా ప్రోత్సహించేకంటే 
కులనిర్మూలన దిశగా ప్రభుత్వానికి సలహా ఇస్తే బాగుండేది ఆ నాయకుడు .
కులం పేరుతొ ప్రజలను రెచగొట్టి పబ్బం గడుపుకుంటున్న
రాజకీయ పార్టీలను వదిలి కాలేజి యువతకు
 ఇలాంటి సందేశాన్ని ఎందుకిచ్చాడో?

Sunday 12 March 2017

ఒక్కో అడుగు దివాలా వైపు


ఒరేయ్ ఎల్లయ్య!
మొన్న కొన్ని గొర్లు అమ్ముతే వచ్చిన
 రొండు లచ్చలు బ్యాంకుల ఎయ్యాలెరా
 జర  వత్తవా బ్యాంకుకు.
అరే! మల్లిగా....
నీకు దెల్వదా  ఇప్పుడు బ్యాంకుల
పైసలు ఏసినా తీసినా మనకు చార్జి పడుతదట.
ఇంగో గట్ల గాదుగని మన సావుకారి దగ్గర పెడుదాంర
వడ్డికీ వడ్డీ ఇస్తడు పైసలుగూడ ఎప్పుడంటే గప్పుడు ఇస్తడు.
కార్పోరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే మన బ్యాంకులు
 సామాన్యులంటే చులకనగా చూస్తూ
 సవాలక్ష నిబంధనలు
నెలకు ఇన్ని లావాదేవీలే, మినిమం బ్యాలెన్సు
 ఇంత అంటూ పెడుతున్నాయి.
అదే సామాన్యుడికి మండితే బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా
 ఒక్కసారిగా తీసుకుంటే పరిస్థితేంటి .మార్చిలో టార్గెట్ చేరుకోలేక
 రేటింగ్ పడిపోయి దివాలతీయవా?
సామాన్యులు చేసే డిపాజిట్లను వడ్డీలకు తిప్పుకుంటూ
 బతికే బ్యాంకులువాళ్ళకే ఇలా   అర్థం పర్థం లేని
 నిబంధనలు పెడితే ఎలా
మోడీ ఎఫెక్టు తో  ఒక్క నెల బ్యాంకులు కలకలలాడగానే కళ్ళునెత్తికెక్కాయ?
పూర్తిగా డిజిటల్ పేమెంట్ దిశగా అడుగులు వేద్దామన్న
 తరుణంలో ఇటువంటి నిర్ణయాలు శరాఘాతాలే. ఇప్పటికైనా  RBI
  పునరాలోచించుకోవాలి . కస్టమర్లు పోస్తాఫిసులవైపు
 వెళ్ళకముందే కల్లు తెరుస్తే మంచిది .
ఇప్పటికే చాలామంది paytm లాంటి Ecomerce సైట్లు  వాడు తున్నారు.
ఇక అందరూఅటువైపు వెళ్తే బ్యాంకులు జీతాల టైంలో తప్ప ఇంక వాడరు.
అప్పుడు దివాళాతీయక తప్పదు.
కాబట్టి ఏ నిర్ణయమైనా సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది .
చూద్దాం ఏంజరుగుతుందో.......

హోళీ శుభాకాంక్షలు

అద్భుతమైన రంగుల పండుగ...
విశ్వవ్యాప్యంగా జరుపుకుంటున్న వేళ
మిత్రులందరికీ
వసంతోత్సవ శుభాకాంక్షలు

Wednesday 8 March 2017

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు






ఎప్పుడూ అమ్మో,
భార్యో, కూతురో తోడు లేనిదే జీవితాన్ని కొనసాగించలేని
ఈ పురుష ప్రపంచానికి ఒక్క మాట ........

        పురుషాధిక్య  భావజాలానికి స్త్రీ
పురుషులిరువురూ అలవాటు పడ్డ ఈ సమాజంలో మార్పు రావాలి.
 అలా అని కేవలంస్త్రీలపై హింస తగ్గిపోవడంతోనే
కాకుండా సమానతను కల్పించాలి.
ప్రకృతిలో సంఖ్య లోనూ,
సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి
ఆవశ్యకమైన మార్పు రావాలి.
స్త్రీలపై అత్యాచారాలూ, పుట్ట బోయే ఆడపిల్లల
భ్రూణ హత్యలూ , యాసిడ్ దాడులూ, 
వరకట్న మరణాలూ లేని సమాజం నిర్మితమవ్వాలి.
         
           తల్లిలా,చెల్లిలా,చెలిలా నెచ్చెలిలా,కూతురిలా ఇలా
ఎన్నో ఎనెన్నో రూపాలతో ఈ సృష్టి కే సృష్టి కర్తలైన స్త్రీ మూర్తులందరికీ
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

Tuesday 7 March 2017

ప్రజల చేతికి బ్రహ్మాస్రాలు

ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం మనది.
సవరణలు కూడా ఎన్నో ...
మారుతున్న కాలానికనుగుణంగా భారత ప్రజల
జీవితాలను మెరుగు పరిచేందుకు ఎన్నో
చట్టాలను
అమలులోకి తెచ్చిన ప్రభుత్వం
ఇప్పుడొక కొత్త బిల్లును తెచేందుకు
సమాయత్తమవుతోందట .
ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిని నచ్చకపోతే
దించేసేఅధికారం ప్రజలకుఇవ్వబోతోందట.
అదే గనక జరిగితే ఏ రాజకీయ నాయకుడైన
ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని
చేయవలసిందే.
ప్రజలకు ఇదివరకే అందించబడిన
వజ్రాయుధం RTI
సమాచారహక్కు చట్టం, ఇప్పటికే చాలామట్టుకు
ప్రభావం
చూపెడుతోంది .దీనికి తోడు ఈ రీకాల్ చట్టం
కూడా వస్తే
వెధవ వేషాలు వేసే నాయకులను దించేసి ,
మంచి పరిపాలనాదక్షత కలిగిన నిజాయతీ కలిగిన
నాయకులను
గద్దేనేక్కించ వచ్చు.

Saturday 25 February 2017

పతనం వైపు పరుగు



ట్రంప్ వచ్చాక అమెరికాలో  ఇప్పటిదాకా ఏకంగా 1,000  కి పైగా
 జాతి వివక్ష దాడుల ఘటనలు  జరిగాయి .
అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే జరుగుతుండడంతో అటు
 భారతీయ విద్యార్థులు , ఇక్కడ తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .
 అసలే ఒళ్ళంతా జాత్యహంకారం కలిగివుండే తెల్లవాళ్ళను  ట్రంప్ వ్యాఖ్యలు బాగా
 రెచ్చగొడుతున్నాయి.  
'మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ ను కాల్చి చంపుతూ
 దుండగుడు  గట్టిగా అరుస్తూ అన్న మాటలు చాలు,
వారి  నరనరాన జాతి వివక్ష ఎలా   జీర్ణించుకుపోయిందో  తెలుసుకోవడానికి .
అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదం తో ప్రచారం చేసిన ట్రంప్
 తన  చర్యలతో  అమెరికాను ఇప్పుడున్న స్థితి నుండి పతనం వైపు తీసుకెళ్ళకపోతే చాలు  అనేది చాలా మంది  అమెరికన్ల మాట .
చాలామంది వలసలకు అనుకూలంగా ఉన్నా కొంతమంది చర్యల వల్ల విదేశీయులు
 సహజంగానే  తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు .
ఐతే ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారంచేసే సంస్థలు ట్రంప్ గెలిచాక
 300 శాతానికి పెరిగాయి .
వీరి విద్వేషానికి అధ్యక్షుని మద్దతుకూడా ఉంది కదా !
తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని,
 కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా
ట్రంప్ అక్కడ ఉన్న విదేశీయులకు తానేమి రక్షణ  కల్పించాలనుకోవడం లేదని
 మా  దేశాన్ని విడిచి వెళ్ళడమే ఏకైక మార్గమని  చెప్పకనే చెప్పాడు .
ఈ సమయంలో భారతీయులు అమెరికాలో ఉండడం ఎంతవరకు శ్రేయస్కరం .
హెచ్‌1బి వీసాల విషయంలో తొందరపాటు చర్యలు సరికాదని అమెరికాను కోరకుండా
 ప్రధాని మోడీ  భారతీయులందరినీ
తిరిగి స్వదేశానికి రమ్మని కోరితే బాగుండేది.
ప్రపంచం మొత్తం ఒకవైపు అమెరికా ఒక్కటి ఒకవైపు అనే అభిప్రాయాన్ని కలిగిన
 అమెరికన్లు తమ పతనానికి తామే
బాటలు వేసుకుంటున్నారు  తెలివైన వాళ్లని కోల్పోవడం ద్వారా.