Tuesday 15 December 2020

తిండి పురాణం

చేసిపెట్టేవాళ్ళు ఉండాలేకానీ, తెలుగువాళ్లకు ఎన్ని రకాలో తినడానికి.. 
కారప్పుస, చకినాలు, గరిజలు, పప్పు చెక్కలు(తెల్ల నువ్వులు, పప్పులు, పల్లీలు వేసి చేసినవి), బొబ్బట్లు, బెల్లప్పుస, వేయించిన అటుకులు, బూంది, బూంది లడ్డు, తొక్కుడు లడ్డు, రవ్వ లడ్డు, పెసర ముద్దలు, మలీద ముద్దలు, ఇంకా గోధుమ పిండితో చేసేవి కొన్ని - గవ్వలు, కారపు పూరీలు ఇలా ఒక్కో పండగకు ఒక్కోటి ఇలా యెన్నో
అప్పటికప్పుడు తినేటియి: సర్వపిండి, మిరపకాయ బజ్జి, పకోడీ, వేయించిన పల్లీలు, ఉడకబెట్టిన కందికాయలు, శెనగ గుడాలు (గుగ్గిళ్ళు), బొబ్బర గుడాలు, ఉడకబెట్టిన వేరుశనగలు/వేరుశనక్కాయలు, అలచంద గుగ్గిళ్ళు అబ్బో బోలెడు..
 చిన్నప్పుడు బొగ్గుల పొయ్యిలో మా అమ్మ పప్పు వండాక, దాంట్లో చిక్కుడుకాయలు కాల్చుకు తినేవాళ్లం. అలానే, నిప్పుల్లో కండగడ్డ (చిలగడదుంప) కాల్సుకుతింటే ఆమజాయే వేరు  ఎండాకాలం శెలవుల్లో కంద గడ్డల్ని ఉడకబెట్టేది మా అమ్మ. కింద పెద్ద గిన్నె, నిండా నీళ్లు, పైన ఇంకో చిన్న గిన్నెలో రెండో నాలుగో గడ్డలు వేసి మూతపెట్టేస్తే అవి ఉడికేవి. భలేవుండేవి.
ఇదంతా మనవల్ల కాదు అనుకుంటే కొనుక్కుని తినేవి: అప్పట్లో స్వీట్లు ఒక అద్దాల బండిలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువగా కొన్నుకునేవి -  బాదుషా, జాంగ్రీ, పేడా, బర్ఫి మరియూ మిక్చర్ నాకు మహా ఇష్టం . కాని కొనుక్కుని తినేది చాలా తక్కువ. ఎప్పుడో, సంవత్సరానికోసారి. అప్పుడప్పుడూ కొన్ని కొత్తవి తెలుస్తుండేది. అలాంటివే చిప్స్, అప్పుడు ఎక్కడా అమ్మేవాళ్ళు కాదు.
ఇప్పుడు మాత్రం ఫాస్ట్ ఫుడ్ ల కాలం నడుస్తోంది