Tuesday 16 January 2018

మ్యూజియంలో మన పండగలు


దేశంలోని వివిధ సాంప్రదాయక పండగలని, భిన్న ప్రాంతాల కళలను
 పరిచయం చేసేందుకు ఏర్పాటైన శిల్పారామంలో
ఇక్కడి  మన స్థానిక సాంప్రదాయ పండగలని కూడా
కొత్తగా ఎక్కడివో అన్నట్టు వింతగా  చూడవలిసి రావటం ..
అంటే ఆధునికత ముసుగులో మనం మన సంప్రదాయాల్ని, రుచులని ఎలా మరచిపోతున్నామో అద్దం పడుతోంది.

నిన్న ఒక మిత్రుడికి  శుభాకాంక్షలుచెబుతామని ఫోన్ చేస్తే
మాటల  మధ్యలో శిల్పారామం వెళ్లిందీ అక్కడ మన సంక్రాంతి హరిదాసులు,
గంగిరెద్దులవాళ్ళు, బుడబుక్కల వాళ్ళను చూసి పిల్లలు సంతోష పడ్డారని చెప్పాడు.
చిన్నప్పుడు చాల మంది ఇలాంటి వాళ్ళు పండగలకి మన ఊళ్లలో వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు
వస్తున్నారా అన్నాడు.
ఏం వస్తార్రా బాబు మొన్ననే  హైదరాబాద్లో గంగిరెద్దుల వాళ్ళని భిక్షగాల్లంటూ అరెస్ట్ చేసారట
కదా అన్నా, అవునురా అలా  అరెస్ట్ చేయడం ఎందుకు? మళ్ళా  వాళ్ళని శిల్పారామంలో ప్రదర్శనల కోసమని ఆంధ్రా నుండి పిలిపించటం ఎందుకు? అన్నాడు

ఇప్పటికే మన పండగల కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లిషోడి పండగలే జరుపుకుంటున్నాం.
మన సాంప్రదాయ పిండి వంటలకంటే వాడి పిజ్జా బుర్గర్ లే మనకు నచ్చుతున్నాయి.
ఏమోరా! ఇలాగైతే మన పండగలని మన పిల్లలిక మ్యుజియంలోనే చూసుకోవాలి అన్నాడు.

పండగలు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం.
దీంట్లో ఎన్నో ఆహార,  ఆరోగ్య, వ్యవహారిక సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం నువ్వుండలు, అరిసెలు, కొత్తబియ్యంతో చేసిన పిండి వంటలు
చలికాలంలో శరీరానికి వేడిని అందించి సంవత్సరమంతా
ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి .
ఇలా ప్రతి పండగకి వండే  ప్రసాదాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సూత్రాలను
ఇముడ్చుకొని ఉంటాయి.
కాని గ్లోబలైజేషన్, మోడరన్ కల్చర్ ముసుగులో
మన సాంప్రదాయాలను ఫణంగా పెడుతున్నాం అనిపిస్తోంది
ఎంత అభివృద్ధి చెందిన మన మూలాల్ని మాత్రం మరవకూడదు.
అలా మరచిపోయిననాడు మ్యుజియంలే దిక్కు మనకు  .....

No comments:

Post a Comment