Tuesday 15 October 2019

బస్సులు బందు

RTC సమ్మె
ప్రస్తుతం తెలంగాణా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది
తెలంగాణ లో పెద్ద పండుగ బతుకమ్మ, దసరా
ఈ టైంలో బస్సులు లేక పుట్టింటికి వెళ్ళే ఆడపడుచులు, స్కూలు, కాలేజీలునుండి సెలవులకు వచ్చేపిల్లలు ఇలా ఎంతోమందికి చాలా కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తోంది.
ఇటువంటి రద్దీ సమయంలో ఈ సమ్మె ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా సంస్థ కు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేసిన పరిస్థితి.
ప్రస్తుతానికి కొన్ని బస్సులను తిప్పుతున్నప్పటికీ వాటిని నడుపుతున్న వాళ్ళ అనుభవ రాహిత్యం తో భద్రత గురించి ఆందోళనే. ఇక టిక్కెట్లు ఇవ్వడమే లేదు. డబ్బులు మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వసూలు చేస్తున్నారు. దీంతో సమ్మెపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండగా మరికొంత RTC ఉద్యోగుల పట్ల సానుభూతి కూడా ఉంది.
దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లాగా కాకుండా మన రాష్ట్రంలో మాత్రం బస్సులు బాగానే నడుస్తాయి. ఒకసారి తమిళనాడు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నుండి తిరుపతి కి వచ్చేలోపు ప్రయాణీకులు లేరంటూ బస్ ఆపరేటర్ నన్ను వేలూరు లో ఒకసారి చిత్తూరు లో రెండుసార్లు అలా మూడు బస్సులు మార్పించాడు. దాంతో మూడు గంటలు లేటు, ట్రైన్ మిస్సయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ మనదగ్గర ప్రయాణీకులు లేరంటూ దాదాపుగా సర్వీసులు రద్దు చేసిన సంఘటనలు ఉండవు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. రూరల్ సర్వీసులు ఎప్పుడూ ఒక వైపు మాత్రమే లాభదాయకం, రిటన్ ట్రిప్పు ఖాళీ గా రావలసిందే. అయినా ప్రజల సౌకర్యార్ధం బస్సులు నడుపుతూనే ఉంది. ఉద్యోగులు కూడా ఆక్యుపెన్సీ ని పెంచి సంస్థ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు ప్రయాణీకులకు ఇచ్చే రాయితీలు RTC కి గుదిబండగా మారాయి అని చెప్పవచ్చు. RTC ని ప్రయివేటు పరం చేస్తే చార్జీలు పెరగడమే కాక ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. ఉదా: సమ్మె కారణంగా ప్రస్తుతం ప్రయివేటు ఆపరేటర్ లు వరంగల్ నుండి హైదరాబాద్కు 500 రూ నుంచి 800 వరకు తీసుకుంటున్నారు. RTC లో AC బస్ లో అయిన 250 మించి లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు 4000 వరకు తీసుకున్నారు.
దీంతో ప్రత్యక్షంగా నష్టపోయేది సామాన్యులే ఐనా దాని ప్రభావం అందరిపైనా ఉంటుంది. ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారని ప్రతీరోజూ దాదాపు 90 లక్షల మందిని తమ గమ్యాలకు చేర్చే RTC ని విడతల వారీగా ప్రయివేటు పరం చేస్తే బస్సులు అందుబాటులో ఉండక అందరూ క్యాబ్ లను ఆశ్రయిస్తే లక్షలాది ట్యాక్సీ లకు మన రోడ్లు సరిపోవు. ఇక కాలుష్యం సంగతి చెప్పనేలేము.
ఏదేమైనా పంతానికి పోయి ప్రభుత్వం కానీ ఉద్యోగులు కానీ సంస్థ మనుగడను ప్రమాదంలో పెట్టకూడదు.

No comments:

Post a Comment