Thursday, 10 July 2025

గురుపౌర్ణమి

వేద వ్యాసుని జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. వేదవ్యాసుని గురువుగా పూజించడం ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, 18 పురాణాలను, మహాభారత భాగవతాలను, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించిన మహాత్ముదు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి విశేషమైంది.  అందుకే వేదవ్యాసుడిని మనం గురుపౌర్ణమినాడు పూజిస్తూ ఉంటాము. "గురు" అంటే ఉపదేశకుడు. ఆధ్యాత్మిక మార్గదర్శకుడు లేదా మోక్షసాధనకు మంత్రం ఉపదేశించేవారు, విద్యాబుద్ధులు నేర్పే ఆచార్యుల పట్ల కృతజ్ఞత తెలియజేసే పర్వదినమే గురు పౌర్ణమి. బుద్ధుడు భోదివృక్షం కింద జ్ఞానోదయం సముపార్జించిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది కూడా గురుపౌర్ణమి ఈ రోజునే భావిస్తారు. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు, తన ముఖ్యశిష్యుని ఎన్నుకొన్నది కూడా గురుపౌర్ణమి నాడే అని కూడా చెబుతారు! అలా జైనులు, బౌద్ధులకు కూడా గురుపౌర్ణమి ముఖ్యమైనదే. షిరిడీ సాయిబాబా ను కూడా గురువుగా భావించి పూజించేవారూ చాలానే ఉన్నారు. జ్ఞాన, విజ్ఞాన మార్గాలలో గురువు పాత్రను గుర్తించడం, వారిపట్ల కృతజ్ఞతను చాటడం కోసం జరుపుకొనేదే ఈ పండగ. గురుశిష్యుల ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాసపౌర్ణమిని చాలా పాఠశాలలు, కళాశాలలో నిర్వహిస్తుంటారు చివరగా... జీవ జీవనానికి మార్గదర్శకులు, సేవా ధర్మానికి ఆచార్యులను, మత ప్రబోధకులను గురువులుగా భావించినప్పటికీ వారంతా బోధించేది వేదవ్యాస విరచిత ధార్మిక గ్రంథాలనుండి సంగ్రహించినదే కావున వేదవ్యాసుడు ఆదిగురువుగా పూజనీయుడు.

Tuesday, 7 December 2021

తిరుమలలో ఉచిత సదుపాయాలు


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకునే వాళ్ళు, అలా దర్శించుకునే కుటుంబాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో.. ఇంకా సంవత్సరం లోపే ఎన్నో సార్లు దర్శించుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు.
ఉచితంగా తిరుమలకు అనగానే ఆశ్చర్యపోకండి. మన ఊరినుండి తిరుపతికి వెళ్ళడం ఉచితం కాకపోవచ్చు కానీ ఒక్కసారి తిరుపతిలో అడుగుపెట్టిన క్షణం నుండి మీరు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు చాలా సేవలు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి భక్తులకు ఆర్థిక భారం తగ్గించేలా టీటీడీ ఎన్నో సేవలను ఉచితంగానూ లేదా నామమాత్రపు రుసుముతో అందుబాటులోకి తెచ్చింది. అందులో ముఖ్యమైనవి దర్శనం, భోజనం, వసతి.
తిరుపతిలో రైలు లేదా బస్సు దిగగానే మనకు మొదట కావల్సింది వసతి. దానికోసం రైల్వేస్టేషన్ పక్కనే విష్ణు నివాసంలో గానీ, లేదా బాస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీనివాసం వసతి సముదాయాల్లో ఉచిత లాకర్ సదుపాయం, పెద్ద పెద్ద డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. నామ మాత్రపు రుసుముతో రూములు కూడా లభిస్తాయి.


భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలవరకు చేరుకునేందుకు ధర్మరథం పేరుతో ప్రతీ రెండు నిమిషాలకు ఒక బస్సు విష్ణు నివాసం నుండి బయల్దేరుతుంది. మన లగేజిని అక్కడే ఇస్తే ఉచితంగా తిరుమలకు చేరుస్తారు. 

కాలిబాటలో కొండ ఎక్కే భక్తులకు మధ్యలో ఉచిత దర్శనానికి టోకెన్, ఉచిత లడ్డూ కూపన్ ఇస్తారు. అదనపు లడ్డూలకు కూడా అక్కడే డబ్బు చెల్లించి కూపన్లు పొందవచ్చు. మెట్ల మార్గం గుండా పైకి చేరుకున్న భక్తులు బస్టాండ్ ఎదురుగా ఉన్న CRO ఆఫీస్ వద్ద ఉచిత గదులు పొందవచ్చు. ఒక్కరికి గది ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి.

వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు కూడా ఉచితంగా ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
(ప్రస్తుతం కోవిడ్ వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు)

తిరుమలలో నాలుగైదు చోట్ల అన్నప్రసాద కేంద్రాల్లో ఉచిత భోజన వితరణ ఉదయం 8 గంటల నుండే మొదలవుతుంది.

తిరుమల లోని అశ్విని ఆసుపత్రితోపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యం ఉచితం .
ఇక ఘాట్ రోడ్డులో వాహనాలు చెడిపోయినా, ప్రమాదానికి గురైనా రిపేర్లు, భక్తులను గమ్యం చేర్చడం ఉచితంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది.
ఇవేకాక మరికొన్ని సేవలను కూడా టీటీడీ ఉచితంగా అందిస్తోంది. 

Sunday, 7 March 2021

మగువలు కావాలి మహారాణులు


ప్రత్యేకంగా ఏదో ఒక రోజున మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించే ఏకైక సమాజం భారతీయ సమాజం

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః*
యత్రే తాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది

'ప్రణమ్యా మాతృదేవతాః "
మాతృదేవోభవ అంటూ అమ్మను తొలిదైవంగా భావించింది భారతీయసమాజం

మాతృవత్పరదారేషు - పరస్త్రీని కన్నతల్లిగా భావించాలని ఉద్భోధించింది భారతీయ సమాజం
కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని సంస్కరించే గురుతరమైన బాధ్యతను గృహిణిగా మహిళకు అప్పజెప్పింది మన భారతీయ సమాజం

భూమితో బాటు సమస్త ప్రకృతిని మాతృస్వరూపంగా భావించి ఆరాధిస్తుంది మన భారతీయ సమాజం.
స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం

ప్రాచీన భారతంలో స్త్రీలు జీవితం లోని అన్ని కోణాల్లోనూ పురుషు లతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు . పురుషులు మాదిరిగానే చదువుకునే వారు . గొప్ప పండితులు , కవయిత్రులు , తత్వవేత్తలుగా ఎదిగినవారూ ఉన్నారు .
ఒక్కమాటలో చెప్పలంటే స్త్రీ ఆరోజుల్లో " లక్ష్మీదేవి " కి తీసిపోని స్థానాన్ని అనుభవించింది. అర్ధాంగిగా సంపూర్ణ పాత్ర పోషించేది .
స్వయంవరం ద్వారా తన భర్త ను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేదని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది .

మనదేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలైన తరువాత స్త్రీల మాన ప్రాణాలను రక్షించుకునేందుకు వారిని ఇంటికే పరిమితం చేయటం మొదలైంది.
వారి మతాల ప్రాబల్యం పెరుగుతూ స్త్రీ ప్రాధాన్యం తగ్గనారంభించింది.
ఆయా మతాల సామ్రాజ్య విస్తరణతోపాటే సమాజములో లింగవివక్షత పాకడం మొదలైంది .
కొంతకాలం గడిచే నాటికి మహిళల స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి.
వారు వంటింటికే పరిమితం అయ్యారు .
నిజం చెప్పాలంటే స్త్రీ జీవితంలో చీకటికోణము అప్పటినుండే మొదలైంది ..
అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు.
స్వాతంత్ర్య అనంతరం సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను పెంచేందుకు యెన్నో చట్టాలు వచ్చినా అవగాహనా లోపాలు, నిరక్షరాస్యతల వల్ల అమలుకు నోచుకోలేదు. కానీ గత రెండు, మూడు దశాబ్దాలుగా ఎంతో మార్పు వచ్చినప్పటికీ, ఇంకా స్త్రీ వివక్ష, బ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పొద్దున్నే పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు చూసినా ప్రముఖంగా కనిపించే మహిళలపై అత్యాచారాలు హింస, వరకట్న వేధింపులు లాంటి వార్తలు బాధను కలిగిస్తుంటాయి..
మహిళల హక్కులు, గౌరవం, ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితికి కారణం ఎవరు , ఎందుకు?..
ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించండి.. ఆడ పిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించండి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడండి.. చాలు
ఇక ప్రతిరోజు మహిళాదినోత్సవమే అవుతుంది
ఇదీ చదవండి👉 మహిళాదినోత్సవం

Tuesday, 15 December 2020

తిండి పురాణం

చేసిపెట్టేవాళ్ళు ఉండాలేకానీ, తెలుగువాళ్లకు ఎన్ని రకాలో తినడానికి.. 
కారప్పుస, చకినాలు, గరిజలు, పప్పు చెక్కలు(తెల్ల నువ్వులు, పప్పులు, పల్లీలు వేసి చేసినవి), బొబ్బట్లు, బెల్లప్పుస, వేయించిన అటుకులు, బూంది, బూంది లడ్డు, తొక్కుడు లడ్డు, రవ్వ లడ్డు, పెసర ముద్దలు, మలీద ముద్దలు, ఇంకా గోధుమ పిండితో చేసేవి కొన్ని - గవ్వలు, కారపు పూరీలు ఇలా ఒక్కో పండగకు ఒక్కోటి ఇలా యెన్నో
అప్పటికప్పుడు తినేటియి: సర్వపిండి, మిరపకాయ బజ్జి, పకోడీ, వేయించిన పల్లీలు, ఉడకబెట్టిన కందికాయలు, శెనగ గుడాలు (గుగ్గిళ్ళు), బొబ్బర గుడాలు, ఉడకబెట్టిన వేరుశనగలు/వేరుశనక్కాయలు, అలచంద గుగ్గిళ్ళు అబ్బో బోలెడు..
 చిన్నప్పుడు బొగ్గుల పొయ్యిలో మా అమ్మ పప్పు వండాక, దాంట్లో చిక్కుడుకాయలు కాల్చుకు తినేవాళ్లం. అలానే, నిప్పుల్లో కండగడ్డ (చిలగడదుంప) కాల్సుకుతింటే ఆమజాయే వేరు  ఎండాకాలం శెలవుల్లో కంద గడ్డల్ని ఉడకబెట్టేది మా అమ్మ. కింద పెద్ద గిన్నె, నిండా నీళ్లు, పైన ఇంకో చిన్న గిన్నెలో రెండో నాలుగో గడ్డలు వేసి మూతపెట్టేస్తే అవి ఉడికేవి. భలేవుండేవి.
ఇదంతా మనవల్ల కాదు అనుకుంటే కొనుక్కుని తినేవి: అప్పట్లో స్వీట్లు ఒక అద్దాల బండిలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువగా కొన్నుకునేవి -  బాదుషా, జాంగ్రీ, పేడా, బర్ఫి మరియూ మిక్చర్ నాకు మహా ఇష్టం . కాని కొనుక్కుని తినేది చాలా తక్కువ. ఎప్పుడో, సంవత్సరానికోసారి. అప్పుడప్పుడూ కొన్ని కొత్తవి తెలుస్తుండేది. అలాంటివే చిప్స్, అప్పుడు ఎక్కడా అమ్మేవాళ్ళు కాదు.
ఇప్పుడు మాత్రం ఫాస్ట్ ఫుడ్ ల కాలం నడుస్తోంది

Monday, 30 November 2020

దేవ దేవుని ఆశీస్సులు

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..

తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.

కానుక సంగతి పక్కన పెడితే... వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రథమైన కార్యం.

To,
Sri Lord Venkateswara swamy,
The Executive Officer
TTD Administrative Building
K.T.Road
Tirupati
517501

Saturday, 15 August 2020

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి


కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండ్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా
ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది.
ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో..
మేం ఎండలో తిరుగుతాం మాకు రాదు అనీ, మేము నాన్ వెజ్ తింటాం మాకు రానేరాదు అని భ్రమ పడుతున్నారు. నిన్న ఒకడు చికెన్ తింటే కరోనా రాదు KTR చెప్పాడు అన్నాడు. ఆయన చెప్పింది చికెన్ తినడం వలన కరోనా రాదు అని.. వీడు తింటే రాదు అని అర్థం చేసుకున్నాడు.
కరోనాకు వీడు వాడు అనే తేడాలు ఏమీ ఉండవు. ఎవరైనా ఒక్కటే
కరోనా మన దేశంలో చాలా నెమ్మదిగా మొదలైంది.. 130కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా కట్టడిని చూసి ఆశ్చర్య పోయిన ప్రపంచం ముందు కొంత మంది నిర్లక్ష్యం మూలంగా తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకున్నాం.
కరోనా గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
ఒకసారి ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇక జీవితాంతం మన శరీరలోనే ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది.
కరోనా వచ్చిన కొందరిలో 3 నెలల తర్వాత యాంటీ బాడీలు నశిస్తున్నాయని కనుగొన్నారు.
ఊహాన్ లో జరుగుతున్న పరిశోధనల్లో కరోనా వచ్చి తగ్గిన వారిలో 90శాతం మందికి ఊపిరితిత్తులు సరిగా పని చేయడం లేదని తేలింది. ఇంకా కొందరికైతే వెంటిలేటర్ కూడా అవసరమౌతోందంటున్నారు.
కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు.
కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది
అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సాసైటీలో పలుకుపడి
ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 
కరోనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే ముందే జాగ్రత్త పడండి
ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు మన జీవితాన్ని తలకిందులు చేయడానికి.. 
కుటుంబం రోడ్డున పడడానికి ....
కాబట్టి ఈ మూడు జాగ్రత్తలు పాటించండి
1. మాస్క్
2. సానిటైజర్
3. భౌతిక దూరం
ఇవే మీకు శ్రీరామరక్ష..

Monday, 10 August 2020

టెక్నాలజీ


గూగుల్
కొన్ని రోజుల క్రితం గూగుల్ నుండి ఫోన్
మీ బిజినెస్ గూగుల్ లో రిజిస్టర్ చేసుకోండి అని
ఇదేదో ఫేక్ కాల్ అనుకున్నా కాని కొద్దిసేపు మాట్లాడాక కాదని  అర్ధం అయింది
అయినా ఇంత పెద్ద ప్రపంచంలో మావూరు చాల చిన్నది .
నాది ఇంకా చిన్న షాపు. దీన్ని రిజిస్టర్  చేసుకోవడం ఎందుకు అన్నా.
ఏమేం లాభాలో కొంతసేపు తను వివరించాడు .
మీరు నాకే ఎందుకు ఫోన్ చేసారు ఎన్నో పెద్ద బిజినెస్ లు ఉన్నాయి కదా అన్నాను
దానికీ  సమాధానం చెప్పాడు.
ఈ ఏరియాలో ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే
మొదట మీబిజినెస్ నే చూపెడుతుంది అన్నాడు.
ఇంకో విధంగా కొత్తగా  మీ ఏరియాకు వచ్చినవాళ్ళకు సహాయంగా కూడా ఉంటుంది అన్నాడు
నిజమే అనిపించింది
(గతం లో కర్నాటక యాత్రలో నాకూ ఇటువంటి అనుభవాలు ఉన్నాయి)
సరే చెప్పండి ఏంచేయాలి అన్నాను
ఏంచేయాలో చెప్పాడు.
అలాగే చేసాను రిజిస్టర్ అయినట్టుగా మెయిల్ వచ్చింది.
గూగుల్ లేకుండా జీవితం గడవడం కొంచెం కష్టమే అనిపిస్తోంది
లేదు గూగులే మనల్ని అలా తయారు చేస్తోందా!!
ఏదైనా తెలుసుకోవాలంటే వెంటనే ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయటమే..
ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్
ఆటలకు ప్లే గేమ్స్ , తెలియని భాష కోసం ట్రాన్స్ లేట్ , గూగుల్ ఫోటోస్ , గూగుల్ కాంటాక్ట్స్
ఇలా ఎన్నో మనకు ఉపయోగపడే అపికేషన్లు, రకరకాల టూల్స్ ప్రపంచం మన చేతిలోకి వచ్చిన ఫీలింగ్.
ఇంకో విషయం
మొన్న మెయిల్స్ చూస్తున్నపుడు మ్యాప్స్ నుండి ఒక మెయిల్
మీరు గత నెలలో ఫలానా ఊరు వెళ్ళినపుడు గుడి ముందు దిగిన ఫోటోను మ్యాప్స్ కు జత చేయమంటారా అంటూ.....
youtube ఓపెన్ చేయగానే   గతంలో ఫలానా వీడియో చూశారు అంటూ అలాంటివే ఓ లిస్టు 

గూగుల్ తో  ఏదైనా సాధ్యమే
లేకుంటే ఏదైనా అసాధ్యమే
అనేంతగా ఎన్నో...

ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు మన  వ్యక్తిగత డేటాను నిల్వ చేస్తాయన్న విషయం బహుశా కొంతమందికి తెలియదు. కానీ ఫేస్ బుక్ అనలిటికా  కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలిసి  ఉంటుంది.

(డేటా విశ్లేషణ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా మొత్తం 5 కోట్లకు పైగా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సమాచారం ఆధారంగా వారికి నిశ్చితమైన రాజకీయ ప్రకటనలు చేరేలా చేసి అమెరికా ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసిందన్నది దానిపై వచ్చిన ఆరోపణ.)

ప్రతిరోజూ కనీసం ఒక్క గూగుల్ ప్రొడక్టునైనా తప్పక ఉపయోగిస్తాము  కదూ.

కాబట్టి, మన  గురించి మరెవ్వరికన్నా ఎక్కువగా ఈ కంపెనీకే తెలుసన్న మాట.

మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉందా? అయితే మీరెవరు, ఎక్కడ నివసిస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తుంటారు వంటి ముఖ్యమైన వివరాలన్నీ మీ అంతట మీరే థర్డ్-పార్టీ యాప్స్‌కు అందజేస్తున్నట్టు 

మీరు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో బ్రౌజింగ్ చేశాక, మీరు విజిట్ చేసే ప్రతి పేజీలోనూ అవే ఐటెమ్స్ కనిపిస్తున్నాయా?

ఇవి ఈ ట్రాకర్లు. థర్డ్ పార్టీ కంపెనీలకు చెందినవి      స్క్రీన్ వెనకాల ఉండి - మీరు ఏమేం శోధించారు, ఏయే వెబ్‌సైట్లు విజిట్ చేశారు, మీ ఐపీ అడ్రస్ ఏమిటి అన్న విస్తృతమైన డేటాను సేకరిస్తాయి.  


ఇలా వీటి బారి నుండి తప్పించుకోవాలంటే  

బ్రౌజర్లలో శాశ్వతంగా ప్రైవేట్ బ్రౌజింగ్‌ను సెట్ చేసుకోవాలి, ప్రతీ అప్లికేషన్ కు పర్మీషన్లు ఇవ్వడం మానుకోవాలి.

క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్ చేసేటపుడు పాస్వర్డ్ సేవ్ చేయకపోడం మంచిది :

రోజుకో కొత్త రకం టెక్నాలజీ పుట్టుకొస్తున్న ప్రస్తుత కాలంలో దాని గురించి తెలుసుకునేలోపే ఒక్కోసారి అనర్థాలు జరుగుతుంటాయి.

కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరు కొంచెం జ్జాగ్రత్తగా ఉంటూ టెక్నాలజీ గురించి అప్డేట్ గా ఉండాలి. 

అప్పుడే మనకు రక్షణ. 

Monday, 16 March 2020

కరోనా

కరోనా

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి
కరోనా.. పుట్టిన దేశంలో వేలాది మంది ప్రాణాలు తీసిన ఆ మహమ్మారి ఇప్పుడు దాదాపు140 దేశాలకు విస్తరించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1లక్షా 50వేల మంది ప్రాణాలను ప్రమాదం లో పడేసింది.
అయితే.. ఈ వైరస్ వ్యాప్తి వెనుక చైనా కుతంత్రం దాగిఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు కొందరు నిపుణులు. అమెరికా ట్రేడ్ వార్ తో తీవ్రంగా నష్టపోయిన చైనా నిజంగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు..
ఇజ్రాయెల్‌కు చెందిన బయోలాజికల్ వార్‌ఫేర్ ఎక్స్‌పర్ట్ డేనీ షోహామ్ అయితే చైనా బయో వార్‌కు దిగిందనే ఖరాఖండిగా చెప్తున్నారు.
ఆధారంగా... ఏ నగరం నుంచైతే కరోనా వ్యాప్తి చెందిందో ఆ చోటే చైనా బయో వెపన్స్‌ తయారు చేసే ప్రయోగశాల ఉందంటున్నారు.
(శత్రుదేశాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపరచి తద్వారా యుద్ధం చేయలేని స్థితిలోకి దిగజార్చడమే బయో వార్ లక్ష్యం)
ఐతే వూహాన్ నగరం లో ఉన్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి అనే లాబ్ WHO కు రెఫరెన్సు గా పనిచేస్తుంది కానీ చైనా తన స్వార్ధ ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
ఎందుకంటే కరోనా వైరస్ ను అభివృద్ధి చేసింది ఇక్కడే , ప్రమాదవశాత్తు అది బయటికి వచ్చి ఇప్పుడు ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది.
కరోనా వచ్చిన వాళ్ళల్లో మరణాల రేటు ఒకటి రెండు శాతమే కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ సంఖ్యలెప్పుడు పూర్తి సమాచారాన్ని ఇవ్వవు
ఇంత పెద్ద మన దేశంలో కనీసం ఒక్క శాతం మందికి (కోటి మంది) సోకినా ఎంత ప్రమాదమో ఒక్కసారి ఊహించండి
ఉపేక్షించడం, తేలిగ్గా కొట్టిపారేయడం ప్రమాదకరం
చైనాలో కరోనాతో మొదటగా మరణించిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన 34 మందిని ప్రస్తుతం పర్యవేక్షణ లో ఉంచారు వాళ్లందరికీ సోకకపోయినా ఎంతమందికి అంటుకునే అవకాశం ఉందొ అర్థం చేసుకోవచ్చు
కరోనావైరస్ గురించి మరో కొత్త కోణం జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు
కోలుకున్న తరువాత కూడా
తిరిగి మళ్ళీ దాని బారిన పడే అవకాశం ఉంది.
అంటే
ఒక సారి శరీరంలోకి జొరబడిందంటే
ఇక ఎప్పటికీ మన ఒంట్లోనే ఉంటుంది.
ఇప్పటికే ఇటువంటి ఒక కేసును వాళ్ళు డీల్ చేస్తున్నారట
అంటే కరోనా బారిన పడకుండా ఉండడమే ఉత్తమ మార్గం
వాస్తవాల కంటే ఊహాగానాలు అధికంగా ప్రచారం అవుతున్న ప్రస్తుత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు

-కరోనా వైరస్‌ ఏ కారణం వల్లనైనా గాల్లో కలిస్తే రెండు గంటలపాటు సజీవంగా ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్త అవసరం. గాలిలోని తేమ, దుమ్ము, ధూళి కణాలతో  ప్రమాదకరమైన వైరస్‌ ఆయా వస్తువులపైకి చేరుతాయి.  వాటిని తాకిన వారికి వైరస్‌ చేరుతుంది. అలాగే బాధితుల చెయ్యి తగిలినా వ్యాధి సోకుతుంది. వీలైనంత వరకు చేతులకు గ్లౌజులు పెట్టుకోవడం ఉత్తమం.
- జనం ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లకూడదు. ముఖ్యంగా బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లకు దూరంగా ఉండాలి. బస్సు, ఆటో, ట్రక్కర్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- చేతితో కంటిని నలపడం, పుసులు తీయడం, చేతితో తుడవడం చేయకూడదు. దీనివల్ల చేతిలో వైరస్‌ కంటిలోకి చేరే ప్రమాదం ఉంది. అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని కంటిని శుభ్రం చేసుకోవాలి.
- పరిచయస్తులు కలిస్తే మర్యాదపూర్వకంగా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం అలవాటు. ఆలింగనం కూడా చేసుకుంటాం. ప్రస్తుతం ఇవేవీ మంచిది కాదు. వీలైనంత వరకు తెలిసిన వారికి నమస్కారంతో సరిపెట్టాలి. విదేశీయులు, విదేశాలకు వెళ్లివచ్చిన వారితో మరీ అప్రమత్తంగా ఉండాలి.
-ముక్కు, చెవి, నోటిలో వేళ్లుపెట్టుకుని కెలకడం వంటివి చేయకూడదు.
- చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్‌ ధరించడం చాలా శ్రేయస్కరం. కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసేవారు వీటిని తప్పక ధరించాలి.
- కిల్లీ, జర్దా, పాన్‌పరాగ్‌ వంటి అలవాట్లు ఉన్నవారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. ధూమపానం అలవాటు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకూడదు.

ఇలా వీలయినంతగా జాగ్రత్తలు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 

Saturday, 30 November 2019

హైదరాబాద్ టూ మేడారం 2


ఇక వరంగల్ నుండి మేడారం వెళ్లే ముందే నిర్ణయించుకోవలసిన విషయం...
ఈ రెండు రూట్లలో ఎటువైపు నుండి తిరుగు ప్రయాణం అని..
1. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తే మొదట లక్నవరం సరస్సు, తర్వాత రామప్ప, ఘణపురం కోట గుళ్లు, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు, పాండవుల గుట్టలు (trekking)






2. ఏటూరునాగారం అభయారణ్యం (site seeing),
మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వాజేడు జలపాతం, పర్ణశాల, భద్రాచలం

మేడారం నుండి తిరుగు ప్రయాణ మార్గంలో చల్వాయి నుండి 8 కిమీ దూరం లో ఉన్న లక్నవరం సరస్సు చూడొచ్చు. సాధారణంగా కాకతీయుల నిర్మాణాలు సరస్సు, జనావాసం, దేవాలయం అనే ప్రాధాన్యం గా ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం సరస్సు మాత్రమే నిర్మించారు. అక్కడి నుండి ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన కట్టడం పాలంపేటలోని రామప్ప దేవాలయం 30 కిమీ. ఇక పక్కనే 15 కిమీ దూరంలో ఘణపురం కోట గుళ్ళను చూడొచ్చు.
తర్వాత కాళేశ్వరం వెళ్లాలనుకుంటే 80 కిమీ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇక్కడే.
లేదు ఘణపురం నుండి తిరిగి వెళ్లాలనుకుంటే మార్గమధ్యలో ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేసిన గుహలు, లక్కమేడలు చూసి (ఇక్కడ సేద తీరేందుకు , పర్వతారోహణ కుపర్యాటక శాఖ   వారి ఏర్పాట్లు ఉన్నాయి ) దగ్గరలోనే ఉన్న త్రేతాయుగం నాటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకోండి.

 2.
మేడారం నుండి ఏటూరునాగారం 30 కిమీ ఇక్కడి నుండి అభయారణ్యం లోకి వెళ్లి చూసేందుకు, సేద తీరేందుకు అటవీశాఖ వారి ఏర్పాట్లు ఉన్నాయి.
(ఇక్కడే కాకుండా వరంగల్ జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా ఈ ఏర్పాట్లు ఉన్నాయి) 
ఇక్కడి నుండి భద్రాచలం వెళ్లే దారిలో మంగపేట వద్ద మల్లూరు అటవీప్రాంతంలో కొలువై ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీరం వలె మెత్తని విగ్రహాన్ని కలిగి ఉంటారు. అక్కడినుండి నేరుగా భద్రాచలం చెరుకోవచ్చు. 
మరోటి ఏటూరునాగారం నుండి మల్లూరు కాకుండా 17 కిమీ దూరంలో ఉన్న వాజేడు జలపాతాన్ని చేరుకొని అక్కడి నుండి పర్ణశాల మీదుగా భద్రాచలం వెళ్ళవచ్చు.

Tuesday, 12 November 2019

హైదరాబాద్ టూ మేడారం

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం
ఈసారి 2020 ఫిబ్రవరి5 నుండి  8 వరకు జరగనుంది.
5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనున్నారు.
ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దెకు చేరుకోనుంది.
ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు,
ఇక 8న అమ్మవార్ల వనప్రవేశం.
జాతర గురించి ఇక్కడ తెలుసుకోండి .  
 కొన్నేళ్ల కింద జాతర ఎలా ఉండేదో ఇక్కడ చదవండి 


మేడారం చుట్టూ, వెళ్లే దారిలో నూ ఎన్నో,మరెన్నో
చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. 
ఆలయ దర్శనం అనగానే  రాయలసీమ, గోదావరి జిల్లాలవైపు
దృష్టి మల్లే మనకు మన తెలంగాణ లొనే మనకు తెలియని ఎన్నో ఆలయాలు
పురాతన కాలం నుండి ఎన్నో రాజవంశాల పాలనలో సంరక్షించబడి మనకందించబడ్డాయనేది
పెద్దగా తెలియకపోవడం మన  దురదృష్టం.
తగినంత ప్రచారం లేకపోవడం లేదా కొన్ని చిన్నచిన్ని గ్రామాలలో,
మారుమూల ప్రాంతాలలో ఉండటం వలన వీటికి రావలసిన గుర్తింపు, దక్కవలసిన గౌరవం
దక్కలేదని భావించవలసి వస్తుంది.
ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు మహమ్మదీయుల పాలనలో
తీవ్ర నిర్లక్ష్యానికి గురవడం కూడా ఒక కారణం.
అయితే చాలా చోట్ల ప్రజలు సంస్కృతి సాంప్రదాయాల, భాష మరియు
ఆరాధనా విధానాల పట్ల ప్రేమతో వాటి అభివృద్ధికి విశేష కృషిచేస్తుండడం అభినందనీయం.
ఈసారి మేడారం
జాతరకు వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే
 జాతరతోపాటు   ఆలాంటి కొన్ని ప్రదేశాలు చూసే అవకాశం ఉంటుంది.
వీలైతే ఈవిధంగా ప్లాన్ చేసుకోండి.

హైదరాబాద్ నుండి బయల్దేరితే మొదట వచ్చేది
చారిత్రక ప్రదేశం అయిన భువనగిరి కోట
అక్కడినుంచి యాదాద్రి దగ్గరే.
ఇక ఆలేరు కు రాగానే ఎడమవైపు వెళ్తే
6 కిమి దూరం లో 2000 సంవత్సరాల నాటి  జైన క్షేత్రం కొలనుపాక,
కుడివైపు వెళ్తే పురాణపురుషుడు  శ్రీరాముడు
మాయాలేడి ని  చంపిన ప్రదేశం జీడీకల్ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
ఇవి అన్నీ  చూడడానికి ఒకరోజు పడుతుంది.

ఇక అక్కడి నుండి తర్వాతి మజిలీగా వరంగల్ చేరుకోవచ్చు.
ఒకప్పటి కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లే నేటి వరంగల్.
తెలంగాణా రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం.
ఇక్కడ సాధారణమైన వాటినుంచి స్టార్ హోటల్ల వరకు
అన్నీ ఉన్నాయి కాబట్టి వసతి కి కొదవ లేదు. మిగతా తర్వాతి పోస్ట్ లో........

Tuesday, 15 October 2019

బస్సులు బందు

RTC సమ్మె
ప్రస్తుతం తెలంగాణా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది
తెలంగాణ లో పెద్ద పండుగ బతుకమ్మ, దసరా
ఈ టైంలో బస్సులు లేక పుట్టింటికి వెళ్ళే ఆడపడుచులు, స్కూలు, కాలేజీలునుండి సెలవులకు వచ్చేపిల్లలు ఇలా ఎంతోమందికి చాలా కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తోంది.
ఇటువంటి రద్దీ సమయంలో ఈ సమ్మె ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా సంస్థ కు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేసిన పరిస్థితి.
ప్రస్తుతానికి కొన్ని బస్సులను తిప్పుతున్నప్పటికీ వాటిని నడుపుతున్న వాళ్ళ అనుభవ రాహిత్యం తో భద్రత గురించి ఆందోళనే. ఇక టిక్కెట్లు ఇవ్వడమే లేదు. డబ్బులు మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు వసూలు చేస్తున్నారు. దీంతో సమ్మెపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండగా మరికొంత RTC ఉద్యోగుల పట్ల సానుభూతి కూడా ఉంది.
దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లాగా కాకుండా మన రాష్ట్రంలో మాత్రం బస్సులు బాగానే నడుస్తాయి. ఒకసారి తమిళనాడు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నుండి తిరుపతి కి వచ్చేలోపు ప్రయాణీకులు లేరంటూ బస్ ఆపరేటర్ నన్ను వేలూరు లో ఒకసారి చిత్తూరు లో రెండుసార్లు అలా మూడు బస్సులు మార్పించాడు. దాంతో మూడు గంటలు లేటు, ట్రైన్ మిస్సయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ మనదగ్గర ప్రయాణీకులు లేరంటూ దాదాపుగా సర్వీసులు రద్దు చేసిన సంఘటనలు ఉండవు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. రూరల్ సర్వీసులు ఎప్పుడూ ఒక వైపు మాత్రమే లాభదాయకం, రిటన్ ట్రిప్పు ఖాళీ గా రావలసిందే. అయినా ప్రజల సౌకర్యార్ధం బస్సులు నడుపుతూనే ఉంది. ఉద్యోగులు కూడా ఆక్యుపెన్సీ ని పెంచి సంస్థ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు ప్రయాణీకులకు ఇచ్చే రాయితీలు RTC కి గుదిబండగా మారాయి అని చెప్పవచ్చు. RTC ని ప్రయివేటు పరం చేస్తే చార్జీలు పెరగడమే కాక ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. ఉదా: సమ్మె కారణంగా ప్రస్తుతం ప్రయివేటు ఆపరేటర్ లు వరంగల్ నుండి హైదరాబాద్కు 500 రూ నుంచి 800 వరకు తీసుకుంటున్నారు. RTC లో AC బస్ లో అయిన 250 మించి లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు 4000 వరకు తీసుకున్నారు.
దీంతో ప్రత్యక్షంగా నష్టపోయేది సామాన్యులే ఐనా దాని ప్రభావం అందరిపైనా ఉంటుంది. ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారని ప్రతీరోజూ దాదాపు 90 లక్షల మందిని తమ గమ్యాలకు చేర్చే RTC ని విడతల వారీగా ప్రయివేటు పరం చేస్తే బస్సులు అందుబాటులో ఉండక అందరూ క్యాబ్ లను ఆశ్రయిస్తే లక్షలాది ట్యాక్సీ లకు మన రోడ్లు సరిపోవు. ఇక కాలుష్యం సంగతి చెప్పనేలేము.
ఏదేమైనా పంతానికి పోయి ప్రభుత్వం కానీ ఉద్యోగులు కానీ సంస్థ మనుగడను ప్రమాదంలో పెట్టకూడదు.

Tuesday, 9 April 2019

ఇంకుడు గుంత

" ప్రపంచంలోని ఆధునిక నగరాలలో తాగునీరు సరఫరా నిలిచిపోబోతున్న  మొదటి నగరం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్  " (11 మే 2019 నుండి )
 కొంత కాలంగా  ప్రపంచమంతా చర్చిస్తున్న  ఒక అత్యంత  దూర్వార్త 
చుట్టూ సముద్రం ఉన్నా కేవలం 40 లక్షల జనాభా ఉన్న నగరానికి 
తాగేందుకు చుక్క నీటిని అక్కడి ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతోంది
కారణం ఏమిటో తెలుసా కోటిమంది జనాభా ఉన్న
మన  హైదరాబాద్ వినియోగించే నీటికంటే ఎక్కువగా వాడతారు
నీటి పొదుపు చేయండని అక్కడి ప్రభుత్వం
ఎంత మొత్తుకున్నా వినని నిర్లక్ష్యం ఇప్పుడు వారికి శాపంగా మారింది
ఇది ప్రారంభం మాత్రమే
ఇకనైనా మనం కళ్ళు  తెరవాలి

ప్రపంచంలోని 500 నగరాల్లో చేసిన పరిశోధనల్లో నీటి కరువుకు చేరువలో ఉన్న మొదటి 10 నగరాల్లో మనదేశంలోని బెంగళూరు రెండవది
1. సౌపాలో - బ్రెజిల్
2.బెంగుళూరు
3.బీజింగ్ - చైనా
4.కైరో - ఈజిప్ట్
5.జకార్త - ఇండోనేషియా
6.మాస్కో - రష్యా
7.ఇస్తాంబుల్  - టర్కీ
8.మేక్సికోసిటి
9. లండన్
10. టోక్యో - జపాన్ 

ప్రపంచంలో ఏ చిన్న వాతావరణ మార్పు జరిగినా 
మొదట  ప్రభావం చూపేది  భారత ఉపఖండం పైనే అనేది సుస్పష్టం 
ఇటువంటి పరిస్తితులల్లో 
నీటి కరువు మన దరిదాపుల్లోకి రాకూడదంటే
ఇంకుడు గుంతలే శరణ్యం అనేది శాస్త్రజ్ఞుల మాట
వాన నీటి సంరక్షణ లేకపోవడం వలన
నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తోంది.
దీన్ని అధికమించాలంటే ప్రతీ ఒక్కరు ఇంకుడుగుంతల అవశ్యాన్ని గుర్తించాలి.
ప్రభుత్వాలు  ఆదిశగా వాల్టా లాంటి కొన్ని చట్టాలు చేసినా
అమలులో అలసత్వం వలన భవిష్యత్ తరానికి
ఎంతో ద్రోహాన్ని చేస్తున్నాం
కురిసే వర్షంలో పట్టణాల్లో 92% వృధాగా పోతోందని అంచనా
ఈ విషయంలో పల్లెలు కొంచం నయం
చెరువుల్లోనో, ఫాంపాండ్స్ లోనో నిలువ చేసుకుంటున్నారు
ఇంకుడు గుంతల వంటి సంరక్షణ ఏర్పాట్లు ఉంటే
ఒక్క సంవత్సరంలో కురిసే వర్షంతో ఒక కుటుంబానికి
3 సంవత్సరాల పాటు సరిపోయే నీటిని  సేకరించుకోవచ్చు
కాబట్టి ప్రతీ ఒక్కరు వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి


ఇంకుడు గుంత నిర్మాణం:
సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతలను త్రవ్వాలి.
ఆ గుంతలో పావు భాగము పెద్ద బండ రాళ్ళతో నింపాలి,
ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకర,  తర్వాత చిన్న కంకరతో  నింపాలి.
ఆపైన కర్ర బొగ్గుతో ఒక వరుస వేయాలి 
దాని పైన దొడ్డు ఇసకను వేయాలి, 
వర్షపు నీటిని ఆ గుంతలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి 
ప్రతీ సంవత్సరం పైన ఉన్న ఇసకను మార్చాలి 
లేదా బయటకు తీసి కడిగి మల్లి వేయాలి 
మీ ఇంటి, వ్యవసాయ బోర్లు, బావుల్లో జలసిరులు చేరాలంటే 
ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు 
దీనికి ప్రభుత్వం తరపున సహాయం కూడా అందుతుంది


Monday, 25 February 2019

విషకౌగిలిలో దీర్ఘాయుష్షు


దీర్ఘాయుష్మాన్ భవ అని ఎవరైనా దీవిస్తే  భయమేస్తోంది!!
అయినా
30 ఏళ్లకే బీపీ 35 కు షుగరు
40 కి రాగానే గుండెపోటు 45 కి రాగానే ఏదో కాన్సర్  
లేదంటే పక్షవాతం.... ఇక వందేళ్లు బతకాలని ఎవడనుకుంటాడు
అన్నాడు మిత్రుడొకరు
ఔను! మన కంటే ఒకటి రెండు తరాల ముందు వాళ్ళు బాగానే ఉండే వాళ్ళు 
మరి మన కి ఏమైంది??
ఏముంది
1960-70 లో హరిత విప్లవంతో మొదలైన 
విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగుమందుల
వాడకం కాస్తా మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది
వ్యవసాయ భూముల్లో వరి,పత్తి, మిరప,
కూరగాయలు మరేఇతర వ్యవసాయ పంటలు వినియోగిస్తున్న
రసాయనాలు (అగ్రోకెమికల్స్) నేరుగా
చెరువుల్లోకి అక్కడినుండి బోర్లు, బావుల్లోకి ఇంకా నదుల్లోకి చేరుతున్నాయి.
దాంతోభూగర్భ జలాలు
కలుషితమవుతున్నాయి అలా కలుషితమైన
నీటినే వంటకు, తాగడానికి వాడుతున్నాం 
అదే ఈవ్యాధులకు ముఖ్య కారణమని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి 
అయినా ఇవి ఒక కొలిక్కి రావడంలేదు ఎందుకంటే ఇవి
పరస్పర ఆధారిత మరియు బహుళ విభాగ
పరిశోధనలతో ముడిపడి ఉంటాయి


అదీకాక మనం తినే ఆహారంలో 
పురుగుమందులు, రసాయనాల అవశేషాల స్ధాయి చాలా ఎక్కువట. 
ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసిన తర్వాత 
పంటలు (ఆకు కూరలు, కాయగూరలు) కోయటానికి 
కనీసం పది రోజులు ఆగాలి కానీ అలా జరగడం లేదు.
లేదంటే అలాంటి కూరల వల్ల నాడివ్యవస్థ, నరాల
వ్యవస్థ దెబ్బతింటుంది.. కాలేయం పనితీరు పాడయ్యే
అవకాశం ఉంటుంది. మూర్చ వచ్చే ఆవకాశం ఉంటుంది. రోగ నిరోధక
శక్తి తగ్గిపోయి చిన్నచిన్న వ్యాధులకు కూడా శరీరం
తట్టుకోదు. తరచూ జలుబు, తలనొప్పి వస్తుంది. నీరసంగా ఉంటుంది.
కొన్ని మందుల వల్ల క్యాన్సర్ వంటివి కూడా సోకే ప్రమాదం కూడా ఉంది.
వాహనకాలుష్యంతో  వెలువడే పొగలో ఉండే సీసం, మరికొన్ని రసాయనాల వల్ల క్షయ, మెదడు సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి 



ఇక రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే అజినమోటో, వెనిగర్, ఫుడ్ కలర్స్ లాంటివే కాక నిలువ ఉంచేందుకు వాడే రసాయనాలు ఎన్నో ...
మరో విషయం కూడా పరిగణనలోకి
తీసుకోవాలి. చిన్న చిన్న జలుబు,దగ్గు,జ్వరం లాంటి జబ్బులకు,
చీటికీ మాటికి ఆర్.ఎం.పి.ల ప్రెస్క్రిప్షన్ తో మందుల గోళీలు
వాడటం కూడా ఆరోగ్యం దెబ్బతినటానికి ఓ కారణం . 
క్లిష్టమైన అనారోగ్య పరిస్థితుల్లో వాడాల్సిన కొన్ని మందుల్ని  RMP లు అతి సాధారణంగా వాడేస్తున్నారట. దాంతో అత్యవసర పరిస్థితుల్లో ఆయా మందులకు జబ్బులు లొంగటం లేదు అనేది కొన్ని పెద్ద ఆసుపత్రుల ఫిర్యాదు..
చీటికీ మాటకి మందులు మింగకుండా,
రసాయనాలతో కూడిన ఆహారాన్ని త్యజించి సేంద్రీయ ఆహారం తీసుకునే దిశగా ప్రయత్నిస్తూ అందరూ కాస్త అవగాహన పెంచుకుంటే వందేళ్లు బతికినా బాధ ఏమీ ఉండదు..
ఎవరికీ భారమవ్వరు..

                                          దీర్ఘాయుష్మాన్ భవ

Friday, 15 February 2019

రెండు రోజుల్లో పంచారామాలు ...

బిజీ బిజీ జీవితంలో కాస్త విశ్రాంతి కోసం అలా ఓ రెండ్రోజుల 
ఏదైనా విహారాయాత్రకు వెల్దామని నిర్ణయించుకున్నదే తడవుగా  
మా మిత్రులందరూ మేము సైతం అంటూ ok చెప్పారు
మరి ఎటు వెళదాం??
విహారయాత్రకు.....
ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు..
ముక్కోటి దేవతలు కొలువైన ఆలయాలు..
ఆకుపచ్చని అరణ్యాలు..
ఆకాశం నుండి దూకే జలపాతాలు..
ఎన్నో ఉన్నా ఈసారి ప్రకృతి రమణీయతకు, 
అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రాలకూ 
నెలవుగా ఉన్న గోదావరి జిల్లాలోని
పంచారామ క్షేత్రాలను చుట్టి రావాలనుకున్నాం
సమయం అనుకూలిస్తే మధ్య మధ్యలో ఉండే 
ఇతర క్షేత్రాలను చూడాలనుకుంటున్నాం
వెళ్తున్నామనగానే ఎక్కడ ప్రారంభించాలి, ఎలా వెళ్ళాలి, 
ఎక్కడ బస చేయాలి, ఎక్కడముగించాలి అని కొందరు మిత్రులు  
వారి అమూల్యమైన సలహాలు,సూచనలు  తెలియజేసారు 
వారందరికీ  ధన్యవాదాలు. 
 రెండు రోజుల్లో చుట్టి రావడానికి ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటె 
కామెంట్ చేయండి please


Saturday, 26 January 2019

ఫోన్ సెన్స్


మన దేశంలో దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఫోన్ ఉంది
ఇంకా కొందరికి రెండు కూడా ఉన్నాయి
భారత టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం
31 డిసెంబర్ 2018 నాటికి మనదేశంలో
121 కోట్ల సెల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని అంచనా
అందులో 50 కోట్ల వరకు స్మార్ట్ ఫోన్లే
ఇంకా ల్యాండ్ ఫోన్లు అదనం .....
పుస్తకం హస్త భూషణం అనేవారు ఒకప్పుడు, మొబైల్ హస్తభూషణం అయిపోయింది ఇప్పుడు
కానీ ఈ ఫోన్లు మనుషుల పరువు తీయటమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెస్తున్నాయి

మొన్నొకతను బస్ లో ఫోన్ మాట్లాడుతూ టికెట్ తీసుకోవడమే మరిచిపోయాడు
దాదాపు 20 కిలోమీటర్లు వెళ్ళినతర్వాత గుర్తుకొచ్చింది పాపం
ఇంకొందరికైతే ఎప్పుడూ ఫోన్ చెవికి ఆనించే ఉంటుంది ఆఫీస్ అయినా రోడ్ మీదైనా
మనమెవరితోనైనా మాట్లాడుతూ ముఖ్యమైన ఉంటామా
ఇంతలో వాళ్లకు  ఫోన్ వచ్చిందనుకోండి మనల్ని మరిచిపోయి మరీ అందులో లీనమైపోతారు
అదేమైనా ముఖ్య విషయమా అంటే ఏ పార్టీకో వస్తావా అనో నిన్న చూసిన సినిమా గురించి రివ్యూ నో అవుతుంది
కానీ ఎదురుగా ఉన్న మనిషిని పట్టించుకోవడం ఉండదు. కొందరైతే  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు
 ఒకసారి నాకు తెలిసిన ఒకతను అలా మాట్లాడుతూ వెళ్లి ఒక  కరెంటు  ట్రాన్స్ఫార్మర్  మీదే చెయ్యి వేయబోయాడు.
పక్కనే ఎవరో ఉండి ఆపారు కాబట్టి సరిపోయింది లేదంటే ....
ఇంకొకాయనైతే ఒక బస్సు  ఎక్కాల్సింది ఇంకోటి ఎక్కాడు.
ఇంకా చాలా చూస్తున్నాం హెడ్ సెట్ పెట్టుకొని రోడ్డు దాటేవాళ్ళు ప్రమాదాలకు గురికావటం,
సెల్ఫీలు దిగుతూ, ఫోన్ మాట్లాడుతూ బండి నపడం వల్ల ప్రమాదాలకు గురికావడం .
ఇంకా కొందరైతే మనకు ఫోన్ చేసి ఇంకెవరితోనో మాట్లాడుతూవుంటారు
  
ఆఫీసులో ఉన్నప్పుడు పర్సనల్ కాల్స్ తక్కువగా అటెండ్ చేయడం మంచిది
మిత్రులు, బంధువుల మధ్య ఉన్నప్పుడు ఫోన్ కంటే వాళ్ళకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇవ్వడం మంచిది
దానివల్ల వాళ్లు మనల్ని గౌరవంగా చూడడమే కాకుండా వాళ్ళు మనకు ముఖ్యులు అనే నమ్మకం వాళ్లకు కలుగుతుంది
సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్  వచ్చాక బంధాలు , బంధుత్వాలు పలచబడుతున్నాయి,  ప్రేమలు తగ్గుతున్నాయి
నా చిన్నప్పుడు TV  వచ్చి కుటుంబ సభ్యల మధ్య దూరం పెంచింది అనేవారు
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు బంధాలను పూర్తిగా తెంచేలా ఉన్నాయి
హాస్పిటల్స్ కి వెళ్ళినపుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేయడం మంచిది
ఒక్కోసారి ఫోన్ రేడియేషన్ వల్ల అక్కడి కొన్ని పరికరాలు పనిచేయకపోవచ్చుకూడా
దాంతో రోగులకు సరైన సమయంలో అత్యవసరమైన వైద్యం అందించలేకపోవచ్చు
ఫోన్ ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఎందుకు  మాట్లాడకూడదో ఎవరో వచ్చి చెప్పరు కదా 
కాబట్టి మనమే కాస్త విచక్షణతో వ్యవహరించటం మంచిది 

Tuesday, 30 October 2018

వెలుగుల దీపావళికి చీకటి బహుమతి


ఈమధ్య కోర్టులు హైందవ ఆచారాలకు, విధానాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం
హిందువుల్లో తీవ్ర నిరాశకు, న్యాయ వ్యవస్థ పట్ల వ్యతిరేకతకు కారణమవుతున్నాయి
 మొన్న శబరిమలలో ఆడవారి ప్రవేశం గురించిన తీర్పు
ఇప్పుడేమో దీపావళికి రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని..
ఎక్కడున్నాం మనం..
 హిందూ దేశంలో నా లేక పోతే ఇంకేదైనా దేశంలోనా
హిందూ పండుగలంటే ఎందుకంత చులకన అంటూ మండిపడుతున్నారు.
రెండు గంటల సమయం ఎవడికి సరిపోతుంది
దీపావళి దక్షిణాదిలో రెండు రోజులు జరుపుకుంటారు
కానీ ఉత్తరాది వారైతే వారంపాటు ఘనంగా జరుపుతారు
ప్రపంచ వ్యాప్తంగా హిందూ పండగలని అన్ని మతాలవారు ఘనంగాజరుపుతూ ఉంటే
మన దగ్గర సెక్యులర్ ముసుగులో హిందుత్వాన్ని , ఆచారాలను, సాంప్రదాయాల్ని
అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
హిందూ పండగల్లో ఉండే ప్రతీ కార్యక్రమం  ఒక శాస్త్రీయ  కారణాన్ని,
ఇంకా అనేక ఆరోగ్య రహస్యాల్ని కలిగి ఉంటుంది.
ఈవిషయం ప్రపంచమంతటికీ తెలుసు
కానీ ఇక్కడి కొందరు హేతువాదులు, కుహనా లౌకిక మేధావుల వల్ల ఇక్కడ
తరచుగా వివాదాలలోకి లాగబడుతోంది .
ముఖ్యంగా వినాయకచవితి, దీపావళి పండగల విషయంలో కాలుష్యం పేరుతొ
నిబంధనలు విధించడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
నిజానికి దీపావళినాడు టపాసులు కాల్చడంవల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఏడాదికొకసారి సంభవించే ఈ కాలుష్యం యొక్క  ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే 
ఈ శుభ సాంప్రదాయం పట్ల ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి,  
ఇటువంటి ఆచారాల్ని త్యజించటం వాళ్ళ కలిగే నష్టాలు కూడా బోధ పడతాయి.
దీపావళి వర్షాకాలం పూర్తిగా గడచిన తర్వాత వస్తుంది 
టపాకాయలు కాల్చటం వల్ల వర్షాకాలంలో విపరీతంగా పెరిగిన క్రిమికీటకాలను నిర్మూలించవచ్చు 
దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది . టపాకాయల్లో వాడే గంధకం వల్ల పప్పుదినుసుల పంటలు 
ఏపుగా పెరిగి దిగుబడికూడా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి . 
చలికాలంలో వేసేది కూడా ఎక్కువగా ఆ పంటలే 
ఇంకా గంధకానికి ఎంతకూ తగ్గని మొండి చర్మ వ్యాధుల్ని(fungal infections) కూడా తగ్గించే గుణం ఉంది 
అందుకే గంధకపు వేడినీటి చెలిమెలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది
 ప్రతిరోజు వెలువడే కాలుష్యం వదిలేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగే పండగలకు నిబంధన విధించడం ఏమిటి  ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో పేల్చ బాణాసంచా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దీనిపై  స్పందన ఏమీ ఉండదు అంటూ హిందూ సంఘాలు మండి పడడంచూస్తూనే ఉన్నాం
 శబ్దము మరియు పొగ తక్కువగా వచ్చే టపాకాయలను తయారుచేయాలని కంపెనీలకు సూచిస్తే బాగుంటుంది విదేశాల నుంచి దిగుమతి అయ్యే అటువంటి టపాకాయలను నిషేధిస్తే ఇంకా మంచిది ఆ వైపుగా చర్యలు తీసుకోకుండా సాధారణ ప్రజల పై తీర్పులను రుద్దడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది ఎన్నో ఏళ్ల నుంచి మూలన పడి ఉన్న కేసులు కాకుండా ఇటువంటి కేసుల్లో ఏదో కొంపలు మునిగిపోయినట్లు అత్యంత త్వరగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఏముందో.
 కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వడం వలన ప్రజలకు కోర్టు పైన ఉండే సదభిప్రాయాన్ని కోల్పోతాయి తప్ప ఒరిగేదేమీ లేదు

Saturday, 4 August 2018

ప్లాస్టిక్ కు దూరంగా ఉండలేమా

"ప్లాస్టిక్ నిషేధం
మాటలకే పరిమితమైన ఒక గొప్ప ప్రణాళిక

ప్లాస్టిక్ కవర్ల వల్ల
పర్యావరణానికి చేటని ఎంతో మంది నిపుణులు
చెబుతున్నా ఆ మాటలను పెడచెవిన పెట్టి
యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది.
ఇంకా..
ప్లాస్టిక్ తీవ్రమైన వాతావరణం కాలుష్యం కలిగిస్తుంది అనేది
అందరికి తెలిసిన గొప్ప సత్యం కానీ మానటం అయిష్టం 
ఎందుకంటే అంత చవకలో మరో ప్రత్యామ్నాయం లేకపోవటం కారణం

కిరాన సరకులు, మందులు తెచ్చుకున్నా , కూరగాయలు,హోటళ్ళనుండి ఇలా కవర్లలో  టీ, టిఫిన్ లాంటి వేడి  ఆహార పదార్థాలు ప్యాక్ చేసినప్పుడు పేగులు, కడుపు సంబంధిత కాన్సర్ లను కలిగించే రసాయనాలు తీవ్ర స్థాయిలో ఆహారం లో కలుసున్నట్టుగా కనుగొన్నారు.


ప్లాస్టిక్ కవర్ల నిషేధంలో భాగంగా 40 మైక్రాన్ల  కంటే మందంగా  ఉండే
కవర్లే వాడాలనే నిబంధన ఉంది కానీ ఇవికూడా భూమిలో త్వరగా కరిగిపోవు,
కానీ పునర్వినియోగానికి అవకాశానికి అవకాశముంటుంది,
వ్యాపారులు కూడా ఆర్ధిక భారం తో
వాడకం తగ్గిస్తారనే ఆలోచన అయివుండొచ్చు.
ప్లాస్తిక్ వినియోగాన్ని క్రమబద్దీకరించి నిషేధాన్ని సరిగా
అమలు పరచటంలో విఫలమైన దేశాల్లో మనది ఒకటి.


కవర్లు పారవేయడం వల్ల భూమిపై ఒక పోరలాగ ఏర్పడి వాన నీటిని ఇంకకుండా అడ్డుకుంటున్నాయి  దాంతో నీటి కరువు ముప్పు పొంచి ఉంది.

ఇంకా సముద్ర కాలుష్యం లో దాదాపు80 శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి.
జలచరాలు, పశుపక్ష్యాదుల మరణానికి కారణమౌతోంది 



మనిషిఅలసత్వమే ముఖ్య కారణంగా
మనకి జీవనాధారమైన  గాలి, నీరు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి

ప్లాస్టిక్ కవర్లతో జరిగే నష్టాలను ప్రజలకు
తెలిసే విధంగా ప్రభుత్వం, మేధావులు కృషి చేయాలి.
ప్రత్యామ్నాయాలు చూపిస్తూ
మెల్లమెల్లగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం నుంచి
దూరం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ప్రతి ఒక్కరూ బాధ్యత గా  ప్లాస్టిక్  వినియోగాన్ని నిలిపివేసినప్పుడే మీపిల్లలు
 " నేను పెరిగి పెద్దవాడినయ్యే వరకు ఈ అందమైన ప్రకృతిఇలాగే ఉంటుందా?
అని అడిగితే
ఉంటుంది అని సమాధానం ఇవ్వగలరు 

కాబట్టి  నేను ప్లాస్టిక్ వాడను అని  వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి.
మార్కెట్కు వెళ్ళినా, కిరాణా షాపుకు వెళ్ళిన
ఒక సంచి తెసుకొని వెళ్ళటం అలవాటు చేసుకోండి 

అందమైన ప్రకృతి, ఆరోగ్యకర జీవితాన్ని
పిల్లలకందివ్వలేనపుడు ఎన్ని కోట్లు కూడబెట్టి వారికిచ్చినా ఫలితం శూన్యంకదా !!!

Monday, 30 July 2018

పచ్చని చెట్టు ప్రాణభిక్ష పెట్టు

నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే ఊరికి బయలుదేరా, 
బస్టాండ్ లో ఎప్పుడూ మనం ఎక్కాల్సిన బస్సు తప్ప అన్నీ ఉంటాయి 
కానీ  బస్టాండ్ కు వెళ్ళగానే ఎక్కాల్సిన బస్ కనపడింది, అదృష్టం అనుకున్నా . 
వెళ్లాల్సిన ఊరికి ఒక గంటన్నర  ప్రయాణం. 
బస్ బయల్దేరాక గంటకు చిన్న పల్లెటూరులో ఓ ఐదుగురు బడిపిల్లలు ఎక్కారు
నా ప్రక్కనే ఒక అబ్బాయి ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. 
బడికి వెళ్లటం ఇష్టం లేదేమో అని అడిగా.
కాదు అంటూ తలూపాడు.
మరింకేంటి అడిగా..
మాఇంటిముందు ఉన్న రెండు చెట్లూ కొట్టేస్తున్నారు అన్నాడు.
అయితే నువ్వెందుకు ఎడుస్తున్నావు అన్నా
రోజు ఉదయం, సాయంత్రం వాటికిందే కదా మేము ఆడుకునేది , 
దానికి ఉన్న ఊయల కూడా తీసేశారు,
మా టీచరేమో చెట్లు  లేకుంటే ఆక్సీజన్ ఉండదు 
అది లేకుంటే మనం చచ్చిపోతాము అంది. చెట్లు తీసేస్తే మాకు ఆక్సీజన్ ఎట్లా? 
మా ఇంట్లోవాళ్ళంతా చనిపోతామా అంకుల్ అన్నాడు.
ఏం మాట్లాడాలో తెలియలేదు
ఊళ్ళో బోలెడు చెట్లు ఉన్నాయి కదా ఏమీ కాదులే అన్నానే  కానీ
ఇలాగే చెట్లు నరికేస్తూ వెళ్తే  భవిష్యత్ఏ తరాల పరిస్థితి ఏమిటి అని
ఆ పిల్లవాడిలా కాకున్నా కొంత  తెలియని ఆందోళన నాలో కూడా  అనిపించింది .
చిన్నపిల్లవాడి లాగా కూడా మనం ఆలోచించడం లేదే అనిపించింది.

ప్రకృతే ఆధారంగా మన కథ ఆరంభమైంది.
కానీ ఆ ప్రకృతినే నాశనం చేస్తూ ఎదుగుతున్నాం.
ఇంత అందమైన ప్రకృతి ని  స్వార్దంతో పాడు చేస్తూ
భవిష్యత్  మానవాళికీ  ముప్పు తెస్తున్నాం .
ఇలాంటిది నేను ఒక సారి బెంగుళూరు లో చూసాను 
నిజానికి చెట్లు నరికి వేయటం, అడవులు తగ్గిపోవటం వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో బాగా పెరిగిన గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పులు
పచ్చని పరిసరాలకు ఎంత సమీపంలో జీవిస్తున్నారనే దాంతోనూ ముడిపడి
ఉంటున్నాయి
పిల్లల్లో ఊబకాయం సమస్య కు చెట్లు లేకపోవడం వలన కలిగే
గాలి కాలుష్యం కూడా ఒక ముఖ్య  కారణం
పచ్చని ప్రకృతి మధ్యలో గడిపిన తర్వాత ఎదుటివారి పట్ల
దయ, నమ్మకం పెరుగుతున్నట్టు, కాలిఫోర్నియా
విశ్వవిద్యాలయం వారి పరిశోధన చెబుతోంది
పార్కులు,చెట్లతో కూడిన వీధులు గల చోట్ల నివసించే వృద్ధులు ఐదేళ్లు ఎక్కువగా
జీవిస్తున్నట్టు జపాన్ పరిశోధకులు చెప్తున్నారు
ప్రకృతి సన్నిధిలో గడపటం వలన ఒత్తిడి హార్మోన్ల
స్థాయులు బాగా తగ్గి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటాని దోహదం చేస్తుంది.
వినోద సాధనాలకన్నా ఇదే ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది
అంతేకాక ఇవి శబ్ద మరియు ధూలి కాలుష్య కారకాల వడపోతకు ఒక ముఖ్య సాధనంగా పని చేస్తాయి, దాంతో క్షయ వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు 


చెట్టులోనూ దేవుణ్ణి చూసే మనకు ఇలాంటి పరిస్తితి వస్తే???
క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్టు సర్వే ప్రకారం భూమ్మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లుంటే.. భారత దేశంలో సగటున 28 మాత్రమే ఉన్నాయన్నారు.

వృక్షాలు నరికేస్తూ పొతే భూగోళం ఎడారిగా మారేందుకు ఎంతో సమయం పట్టదు
33శాతంగాఉండాల్సిన అడవులు క్రమేపి తగ్గుతూ ఉండటం వల్ల
ఓజోన్ పోరా దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి
భూగర్భ జలాలు, భూసారం క్షీణిస్తున్నాయి.
కరువు కాటకాలు, ప్రకృతి  వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్నాయి

మనిషి జీవితంతో, ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నపుడే
నేటి మన పిల్లలు పెద్దయ్యే సరికి అందమైన ప్రకృతితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని
ఆయుష్షును వారికి అందించవచ్చు



Wednesday, 6 June 2018

సభ్యత లేని జనం


ఆకాశమంత పందిరి.. భూదేవి అంతపీట వేసి వివాహం చేయాలని అంటుం టారు.
ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవల వివాహ వేడుకలను అదే తరహాలో నిర్వహిస్తున్నారు
ఒకప్పుడు బాగా ధనవంతులు ఇంట మాత్రమే కనిపించిన ఈ సంస్కృతి
ఇప్పుడు దాదాపుగా అంతటా వ్యాపించింది.
ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది.
ఎంతగా అంటే గ్రామాల్లో అంత భారీగా చేయలేకపోతే కళ్యాణ వేదికలను నగరాలు, పట్టణాల్లోకి మార్చుకుంటున్నారు
ఇప్పుడు పెళ్లంటే సినిమాలను తలపించే సెట్టింగులు.. కళ్లు జిగేల్‌మనిపించే విద్యుద్దీప కాంతులు..
స్వాగత తోరణం నుంచి పెళ్లి పందిరి వరకూ పూలతో డెకరేషన్..
పూలతో డెకరేషన్ అనగానే గుర్తుకొచ్చింది
కొన్ని రోజుల క్రితం బంధువుల వివాహానికి హాజరయ్యా.
అప్పుడు మాంచి ఎండాకాలం...
దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకునేసరికి
బాగా అలసిపోయినట్లనిపించింది.
గేటు దగ్గరకు చేరుకోగానే  వచ్చేవాల్లందరికి కాస్త
అత్తరు చల్లి చిరునవ్వుతో ఓ రెండు గులాబీలు చేతికిచ్చి పంపుతున్నారు.
అలా గులాబీలు తీసుకుని ముందుకు కదిలి హాలులోకి
ప్రవేశించానో లేదో ఒక పెద్ద పూలతోటలోకి మలుపు తిరిగినట్లనిపించింది.
ఒక్కసారిగా అలసటంతా తేలిపోయింది.
అక్కడ పందిరి డెకరేషన్ అనీ, వేదిక అలంకరణ, హాలు మొత్తం బొకేలు, దండలు అనీ లక్షల్లో పూలు.
గులాబీలు, చేమంతులు, ఆర్కిడ్లూ, జెర్బెరాలూ ఇలాంటివి ఎన్నో రకాల
సుకుమారంగా చూడచక్కగా ఉండి, మనసును ఆహ్లాదంలో ముంచెత్తే రంగురంగుల పువ్వులు 
అద్భుతంగా అలంకరించిన  కొన్ని వందల లక్ష పూలు.
సినిమాను తలపించే  సెట్టింగులో, జిగేల్ మనిపించే విద్యుద్దీప కాంతుల్లో
అలంకరణ ఇంకా అందంగా కనిపిస్తోంది. అలాగే చూస్తూండిపోయా.
ఈలోగా వధూవరులను ఆశీర్వదించటం మొదలైంది
నేనూ వరుసలో వెల్లి ఆశీర్వదించి వచ్చి కూర్చున్నా.
నాపక్కనే వచ్చి కూర్చున్న వాళ్ళ చేతిలో జర్బరా పూలు చూసి ఒకసారి వేదిక వైపు చూద్దునుకదా
 ఉదుద్ తుఫానులో ఆకులన్నీ రాలి బోసిపోయిన  మోడులా తయారైంది.
ఎంతమంది పనివాళ్ళు ఎంత శ్రమపడి అలంకరించి ఉంటారు.
అసలు పనివాళ్ళు అని అనటం సరికాదేమో కళాకారులని అనాలి
అటువంటిది వీళ్ళు కేవలం పది నిమిషాల్లో ఎలా పాడు చేశారు
బయట వెళ్ళేటప్పుడు  చూశాను .. కొందరు వెళ్ళిపోతున్న వాళ్ళు 
వాజుల్లోంచి యద్ధేచ్ఛగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా గులాబీ, జర్బరా 
పువ్వులు గుత్తులు గుత్తులుగా తీసుకుని పోతున్నారు. 
అందరూ పువ్వులు తీసుకుపోతున్నారు.   
ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదా.
ఎంత శ్రమపడి వాళ్ళంతా పాపం వాటిని ఎరేంజ్ చేసి ఉంటారు.. 
ఎందుకనిజనాలకు కొన్ని విషయాల్లో సభ్యత,సంస్కారాలు  ఉండవు..?
అందమైన వాటిని సొంతం చేసుకునే తీరాలనే దుర్బుధ్ధి ఎందుకు?
దూరంనుంచి ఆస్వాదించి పోకూడదా? 
లేదా పెళ్లి పూర్తయ్యే దాకా ఆగకూడదా?.. 
నాలా వీరంతా ఎందుకు  అనుభూతి పొందలేదు ఏమో
సహజానుభూతులు కోల్పోయి జీవం ఘనీభవించిన
మనుష్యుల హృదయాలు అందాన్ని ఆస్వాదించలేవేమో..
జవాబు దొరకని ప్రశ్నలే !

Tuesday, 29 May 2018

మరణం తర్వాత మరెన్నో జీవితాలు

మరణాన్ని గెలవలనుకుంటున్నారా?
లేదు మరణం తర్వాత మళ్లీ
జీవించాలని ఆశిస్తున్నారా?
అయితే మీకున్నది ఒకే ఒక మార్గం
అదే
అవయవ దానం


మనిషి మరణానంతరం కళ్ళు, గుండె,
ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, 
జీర్ణ వ్యవస్థలోని ఫ్రాంకియాస్, 
చిన్న, పెద్ద ప్రేవులు, గుండె కవాటాలు, చర్మం,
ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నీ
అవయవ మార్పిడీకి దానం చేయవచ్చు. 


అలా సేకరించిన వాటితో మరణం అంచున ఉన్న 
8 నుండి 10 మందికి ప్రాణ దానం చేయచ్చు 
ఇంకా మరో 50 మందికి కావలసిన అవయవాలను అందించి 
వారి జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు.
బ్రతికి ఉన్న దాత కూడా అవయవ దానం చేయవచ్చు 
తన జీవితంలో ఒకవ్యక్తి 
ఒక మూత్రపిండంను, క్లోమం యొక్క భాగంను,
మరియు కాలేయం యొక్క కొంత భాగంను దానం చేయవచ్చు. 
కానీ బతికి ఉన్నపుడు కుటుంబ సభ్యులు, 
రక్త సంబంధీకులకు మాత్రమే అవయవ దానం చేయవచ్చు.


ప్రంపంచంలోనే అత్యధికంగా స్పెయిన్లో  10లక్షలకు 34మంది, 
అమెరికాలో 26మంది అవయవ దానం చేస్తుండగా 
మన దేశంలో మాత్రం 0.8 మంది మాత్రమే 
అవయవ దాతలుగా ఉన్నారు.
మనదేశంలో నిరక్షరాస్యత, పేదరికం 
అమాయకత్వం, మూఢ నమ్మకాల కారణంగా 
దీనిపట్ల అవగాహన చాలా తక్కువ. 
ప్రభుత్వం, మీడియాఈ దిశగా ప్రజలను చైతన్యపరిస్తే 
ఎక్కువ మందిని అవయవ దానం వైపు మళ్లించవచ్చు. 
ఇప్పుడిప్పుడే ఆదిశగా అడుగులు పడుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం మొదటి అవయవ మార్పిడి 
వినాయకుడికి జరిగింది. ఇక ఆధునిక వైద్య చరిత్రలో 1905 లో 
కార్నియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో మొదలైంది.

అవయవదానానికి 10 ఏళ్ళ వయసు నుండి 90 ఏళ్ళ
వయసు వారెవరైనా అర్హులే.
దేశవ్యాప్తంగా అవయవాల దానం
కోసం ఏటా 5 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 
వీరందరికోసం రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ కేసుల పైననే 
ఎక్కువగా ఆధార పడవలసి వస్తోంది. 
సాధారణ మరణాలప్పుడు కూడా 
అవయవ దానం జరిగితే  కొంత కొరత తీరినట్టే.
అవయవ దానం చేసినవారి కుటుంబాల్లో పిల్లలకు 
మోహన్ బాబు తమ విద్యాసంస్థల్లో 
5వ తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తానని
2015 లో ప్రకటించి తన సామాజిక బాధ్యత ను నిర్వర్తిస్తున్నారు. 
అలాగే ప్రతిఒక్కరు అవయవ దానాన్ని  ఒక బాధ్యతగా స్వీకరిస్తే 
ఏటా జరుగుతున్న 5లక్షల మరణాలలో కొన్నింటినైనా ఆపవచ్చు.



అవయవ దానం చేయాలనుకునే వారు ఈ క్రింది లంకె పై క్లిక్ చేయండి
 Link  👉 ( మరణం తర్వాత నాకు మరో జీవితం కావాలి  )